రైతులకు సంబంధించిన ప్రతి కార్యక్రమానికి ‘వేదిక’లు అవుతున్నాయి.. సాగు పనులు ప్రారంభం మొదలు పంటలు చేతికి వచ్చే వరకు అన్నదాతలకు అవగాహన, అధిక దిగుబడిపై దృష్టి సారించేందుకు చైతన్య దీపికలుగా మారుతున్నాయి రైతువేదికలు. క్లస్టర్ పరిధిలోని రైతులు.. వ్యవసాయ అధికారుల సమావేశాలు, సదస్సులకు హాజరవుతూ వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. రైతులకు పంటసాగుపై శిక్షణ, ప్రభుత్వ పథకాలపై అవగాహన, ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు ఎంతో సౌకర్యవంతంగా ఈ వేదికలు ఉపయోగపడుతున్నాయి. ఈ అవగాహన నిలయాలను ప్రభుత్వం ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించి, అన్ని సౌకర్యాలతో నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది.
సంగారెడ్డి/ మెదక్, జూలై 2 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులకు లాభసాటి పంటల సాగుపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు అన్ని వ్యవసాయ క్టస్లర్ల పరిధిలోని రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, శుక్రవారం రైతు వేదికల్లో రైతులతో వ్యవసాయశాఖ అధికారులు సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో 116 వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో 116 రైతు వేదికలు, మెదక్ జిల్లాలోని 76 క్లస్టర్ల పరిధిలో 76 రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. లాభసాటి పంటలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు. ఈ వానకాలంలో సంగారెడ్డి జిల్లాలో 6,64,697 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేయగా, ఇప్పటి వరకు 3,47,993 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేశారు. మెదక్లో 3,42,200 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
రైతు వేదికల్లో సమావేశాలు
వానకాలం సీజన్లో రైతులు లాభసాటి పంటలు సాగు చేసి లబ్ధిపొందేలా ప్రభుత్వం రైతులను సన్నద్ధం చేస్తున్నది. ఇందుకోసం రైతు వేదికల్లో వారానికి రెండుసార్లు రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయశాఖ అధికారులు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని ఆయా రైతు వేదికల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో రైతులకు లాభసాటి పంటల సాగుపై అవగాహన కల్పించడం, ఐదు రకాల క్షేత్రస్థాయి ప్రదర్శనలకు రైతులను తీసుకువెళ్తున్నారు. రైతు వేదికల్లో నిర్వహిస్తున్న సమావేశాల్లో రైతులకు పచ్చిరొట్ట ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. పచ్చిరొట్ట వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులకు పచ్చిరొట్ట ఎరువులు వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. రైతు సమావేశాల్లో భాస్వరాన్ని కరిగించే జీవ ఎరువుల వాడకం గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దమ్ము లేకుండా నేరుగా విత్తే వరి సాగు విధానం, వెదజల్లే పద్ధతిలో వరి సాగు, ఎరువులను దఫాలుగా వేయటంపై రైతులకు చెబుతున్నారు. అలాగే, పత్తి, కంది పంటలను ఎక్కువ సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సమావేశాలు చెబుతున్న విషయాలను రైతులు అవగాహన చేసుకుని పంటలను సాగు చేస్తున్నారు.
అందుబాటులో రైతులకు విత్తనాలు
వానకాలంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్లో 6.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకోసం 19,500 క్వింటాళ్ల వరి, 4320 క్వింటాళ్ల కంది, 1610 క్వింటాళ్ల మొక్కజొన్న, 21,840 క్వింటాళ్ల సోయా, 1760 క్వింటాళ్ల పెసర, 920 క్వింటాళ్ల మినుములు, 7.98 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచింది. ప్రస్తుత వానకాలం సీజన్లో 96,780 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతుల కోసం 23,579 మెట్రిక్ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచగా, రైతులు ఎరువులు, యూరియా కొనుగోలు చేస్తున్నారు.
సలహాలు, సూచనలు చేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పించేలా చేసింది. మెదక్ జిల్లాలో 76 రైతు వేదికలు, 76 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో 5వేల ఎకరాలను పొందుపరిచాం. ఏఈవోలు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు రైతు వేదికలకు వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక, శాస్త్ర సాంతికేక పరిజ్ఞానం అందించేలా రైతులకు సలహాలు, సూచనలు చేస్తున్నాం. – పరుశురాంనాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మెదక్
లాభసాటి పంటలపై అవగాహన..
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని 116 రైతు వేదికల్లో వారానికి రెండు సార్లు రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాము. రైతులతో నిర్వహిస్తున్న సమావేశాల్లో మండల వ్యవసాయ అధికారులు లాభసాటి పంటలసాగు, ఎరువుల వాడకం, సాగులో మెళకువలు, యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు రైతులను క్షేత్రప్రదర్శనలకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులు ఎక్కువగా పత్తి, కంది పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం.
– జి.నర్సింహారావు, వ్యవసాయశాఖ అధికారి సంగారెడ్డి