నారాయణఖేడ్, జూన్ 23: నారాయణఖేడ్ పట్టణంలోనే ప్రత్యేక గుర్తింపు కల్గిన శాస్త్రినగర్ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూ. కోటి నిధులతో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం గడి మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఏఎంసీ వైస్చైర్మన్ విజయ్ బుజ్జి కోరిన మేరకు శాస్త్రినగర్లో పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. విజయ్ సహా కాలనీవాసుల సహకారంతో గడి మైసమ్మ ఆలయ పునర్మిర్మాణాన్ని చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఏఎంసీ వైస్చైర్మన్ విజయ్ తన సొంత ఖర్చుతో కాలనీలో హైమాస్ట్ లైట్లు ఏర్పా టు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నజీబ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, నాయకులు మహేశ్రామ్, అంజాగౌడ్, మశ్ఛేందర్, సుదర్శన్ పాల్గొన్నారు.
హజ్ యాత్రికులకు సన్మానం
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మిస్కిన్ తల్లిదండ్రులు గురువారం హజ్యాత్రకు బయలుదేరి వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి వారిని శాలువా, పూలమాలతో సత్కరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించాలని కోరారు. అనంతరం వారు ఎమ్మెల్యేను సన్మానించారు.
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్య
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యాబోధన కోసం తెలంగాణప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ కరపత్రాలను ఆవిష్కరించిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మించిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, నాయకులు పాల్గొన్నారు.