సంగారెడ్డి కలెక్టరేట్, జూన్23: తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. గురువారం వ్యవసాయశాఖ అధికారులతో వానకాలం పంటల సాగు విస్తీర్ణం, పంటల ప్రణాళిక, విత్తనాలు, ఎరువులు, రైతుబంధు, రైతుబీమా అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆయా భూముల్లో పండే పంటలను రైతులకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం ఏ ఆశయంతో ఏఈవోల నియామకం చేసిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. రైతులతో మమేకమై వారితో కలిసిపోయి, భూమి రకం, పంటలు, ఎరువులు, విత్తనాలు అంశాలపై అవగాహన కల్పించి రైతులను చైతన్యం చేయాలని సూచించారు. రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని, వానకాలం ఏ పంటలు వేయాలనే అంశాల పై అవగాహన కల్పించాలన్నారు.
కల్తీ విత్తనాలు, ఎరువులను అరికట్టాలి
జిల్లాలో ఎక్కడా కూడా కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులను రైతులకు అమ్మకుండా అరికట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. విత్తనాల దుకాణాలను తని ఖీ చేయాలన్నారు. విత్తనాల నమూనాలను ల్యాబ్కు పంపించి వాటి నాణ్యత ధ్రువీకరణ పత్రం వచ్చే వరకు డీలర్లు విత్తనాలను అమ్మరాదన్నారు. నాణ్యత పరిశీలించిన తర్వాతనే విత్తనాలను అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినైట్టెతే సంబంధిత దుకాణాన్ని సీజ్ చేసి, డీలర్పై 6ఏ కింద కేసు బుక్ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. విత్తనాలు నాణ్యమైనవని ధ్రువీకరించిన తర్వాత నకిలీ విత్తనాలుగా తేలితే సంబంధిత మండల ఏవో, ఏఈవోను సస్పెండ్ చేసేందు కు వెనుకాడబోనని కలెక్టర్ హెచ్చరించారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి
జిల్లాలోని ఏవోలు తమ తమ మండల పరిధిలో ఉన్న రైతులు, సాగుభూమి, వారు వేసే పంటలు, అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే లా చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ క్లస్టర్కు ఏ సీడ్, ఏ క్రాప్ అన్నది ఏఈవోలు ప్రణాళిక చేయాలని సూ చించారు. పత్తి విత్తనాలు బయటి నుంచి వచ్చి ఇస్తుంటారని, వారిపై నిఘా పెట్టి రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. జిల్లాలో ఎరువులు, విత్తనాలకు సంబంధించి రైతులు ఇబ్బందులు పడొద్దని కలెక్టర్ పేర్కొన్నారు.
రైతుబంధు 100శాతం రైతుకు అందాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అందిస్తున్న రైతుబంధు పథకం కింద 100శాతం రైతులకు అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. రైతుబంధుకు సంబంధించి ఇంకా అప్డేట్ కాని రైతుల బ్యాంకు ఖాతాలు ఏవైనా ఉంటే వెంట నే అప్డేట్ చేయాలని సూచించారు.
రైతు డేటాను అప్డేట్ చేసి జాబితా ప్రదర్శించాలన్నారు. అందుకు ఏఈవోలు అండర్ టేకింగ్ ఇవ్వాలన్నారు. రైతుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందినా ఏఈవోలపై చర్యలు తప్పవన్నారు. ఏఈవో క్లస్టర్ వారిగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి మరోమారు రైతుబంధు అర్హతగల రైతులను గుర్తించాలన్నారు. ఎక్క డా అలసత్వం ఉండరాదన్నారు. అదే విధంగా రైతుబీమా పథకంలో భాగంగా వివిధ కారణాల తో బీమా అందని రైతు కుంటుంబాలకు బీమా డబ్బులు అందేలా ఏవో, ఏఈవోలు రెండు, మూడు రోజుల్లోగా అన్ని రకాల ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వేదికలో రైతులకు వారంలో రెండు శిక్షణలు విధిగా జరిగేలా ఏఈవోలకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.