సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 18: మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయం (ఎమ్జేపీటీబీసీడబ్ల్యూఆర్)లో 6, 7, 8వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. బ్యాక్లాగ్ ఖాళీల్లో భాగంగా ఆయా సీట్లను ఈ పరీక్షతో భర్తీ చేయనున్నారు. ఇందుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలు (సంగారెడ్డిలో 14, మెదక్లో 8, సిద్దిపేటలో 7) ఏర్పాటు చేశారు. మొత్తం 7,037 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 3,409 మంది, మెదక్ జిల్లాలో 1,750 మంది, సిద్దిపేట జిల్లాలో 1,878 మంది పరీక్షకు హాజరు కానున్నారు. తరగతుల వారీగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3,409 మందిలో 6వ తరగతిలో 1,401 మంది, 7లో 1,026 మంది, 8లో 982 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మెదక్ జిల్లాలో మొత్తం 1,750 మంది విద్యార్థుల్లో 6లో 727 మంది, 7లో 574 మంది, 8లో 449 మంది, సిద్దిపేట జిల్లాలో మొత్తం 1878 మంది విద్యార్థుల్లో 6లో 774 మంది, 7లో 602 మంది, 8లో 502 మంది పరీక్షకు హాజరు కానున్నారు. హాల్ టికెట్ రాని వారు http://mpjtbcwreis.telanagana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని ఉమ్మడి జిల్లా ఆర్సీవో ప్రభాకర్ తెలిపారు. మరిన్ని వివరాలకు సిద్దిపేట కన్వీనర్ నంబర్ 7995076687, సంగారెడ్డి 8660240185, మెదక్ 6302974304 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం
ఉమ్మడి జిల్లాలో మొత్తం 29 పరీక్షా కేంద్రాలకు 29 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 29 మంది పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బందిని నియమించాం. ఆయా పరీక్షా కేంద్రాల్లో హాల్ టికెట్ నంబర్లు వేసి నిర్వహణకు సిద్ధం చేశాం. గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాం. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలి.
– ప్రభాకర్, ఆర్సీవో, ఉమ్మడి మెదక్ జిల్లా