పటాన్చెరు/అమీన్పూర్ : బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం భూముల్లో అక్రమంగా నిర్మాణమైన ఇళ్లను అధికారులు కూల్చివేశారు. బుధవారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 993, 627 లోని దేవస్థానం భూముల్లో అక్రమ నిర్మాణాలను సంగారెడ్డి ఆర్డీవో నగేశ్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందం తొలగించింది. త్రిపుర కాలనీలోని ఎండోమెంట్ స్థలంలో నిర్మాణమైన రెండు భవనాలను జేసీబీలతో కూల్చివేసింది. సంబంధిత ఇళ్ల యజమానులు ఈ సందర్భంగా ఆందోళనకు దిగారు. తామున్నది ప్రయివేటు వెంచర్లోనని వారు వాదించారు. నిర్మాణాలు ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయని వాటి యజమానులకు ఆర్డీవో స్పష్టం చేశారు.
కబ్జాలకు దిగితే కేసులు తప్పవని హెచ్చరించారు. దీంతో కూల్చివేయబడ్డ ఇళ్ల యజమానుల ఆధ్వర్యంలో తమకు అన్యాయం జరిగిందని అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని నిలువరించి పక్కకు జరిపారు. అనంతరం ఆర్డీవో, మున్సిపల్ బృందం ఇక్రిసాట్ కాలనీలోని ఫేస్ 2 ముందున్న అపార్టుమెంట్లో పై అంతస్తులను, రాఘవేంద్రకాలనీ ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్లో అనుమతులు లేని అంతస్తులను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ దేవదాయ, ప్రభుత్వ, వక్ఫ్ భూముల్లో ఎవరు కబ్జాలకు దిగిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి, నిర్మాణాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్శాఖ అధికారులు ప్రభుత్వ భూములను కాపాడేందుకు అండగా నిలువాలని కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అమీన్ఫూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత, తాసీల్దార్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.