న్యాల్కల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు అన్నారు. మండలంలోని ముంగి ఆదిలక్ష్మి ఆలయ సమీపంలో నుంచి రామతీర్థం, గుంజొట్టీ, వడ్డీ గ్రామాల మీదుగా వెళ్లే మూడున్నర కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం ఫ్లడ్ నిధుల కింద 1.47 కోట్ల నిధులను మంజూరు చేసింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్యరావు మంగళవారం రోడ్డు మరమ్మతు పనులకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత వర్ష కాలంలో ఆయా గ్రామాల మీదుగా వెళ్లే రోడ్డు పాడైపోవడం తో ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు.
ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దూరం కానున్నాయన్నారు. రోడ్డు పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్ట్ ను ఆదేశించారు. ఎప్పటికప్పుడు రోడ్డు పనులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈఈ నరసింహులు, ఏఈ సంధ్య, ఎంపీడీవో జగదీశ్వర్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్, నాయకులు నరసింహారెడ్డి, పాండురంగారెడ్డి, షబ్బీర్ ఖాన్, బక్క రెడ్డి, శ్రీనివాస్,శ్రీనివాస్ రెడ్డి, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.