నర్సాపూర్,ఫిబ్రవరి5: మత్తుపదార్థాల నిర్మూలన అందరి బాధ్యత అని సీఐ షేక్ లాల్ మదార్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో గుడుంబా, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మండలంలో గంజాయి కదలికలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ పద్మ, ఎస్సై గంగరాజు, ఎంపీపీ జ్యోతి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
శివ్వంపేట, ఫిబ్రవరి 5: మండలంలోని అన్ని గ్రామాలను గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తూప్రాన్ సీఐ శ్రీధర్ అన్నారు. శనివారం శివ్వంపేట పోలీస్స్టేషన్లో ఎస్సై రవికాంత్రావు అధ్యక్షతన గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గంజాయి విషయంపై కఠినంగా ఉన్నారన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ పద్మ, ఎక్సైజ్ ఎస్సై ఖాజాఅజీజ్ హైమద్, ఏఎస్సైలు విస్బావొద్దీన్, విఠల్ పాల్గొన్నారు.