పటాన్చెరు, జనవరి 27: చిట్కుల్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్లో కలెక్టర్ శరత్ ఆకస్మికంగా రావడంతో కంటివెలుగు సిబ్బంది హడలెత్తిపోయారు. శిబిరం ప్రజలు లేక వెలవెలబోతుండటం చూసి కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఈ రోజు ఎంతమందికి పరీక్షలు చేశారని అడిగి, సిబ్బంది రిజిస్టర్ను పరీక్షించి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటి వెలుగుపై ప్రజలకు సరైన అవగాహన కల్పించకపోవడంతోనే ప్రజలు రావడం లేదని అన్నారు. మీ నిర్లక్ష్యంతో చక్కటి కార్యక్రమం నీరుగారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు రోజువారీగా ఉన్న టార్గెట్లో సగం మందికూడా రాకపోతే ఎలా అని నిలదీశారు. వైద్య నిపుణులను కూడా కలెక్టర్ పరీక్షల వివరాలు అడిగారు. ఇక మీదుట కంటివెలుగు క్యాంప్లో పరీక్షలు వేగవంతం చేయనిపక్షంలో చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. క్యాంప్లో పరీక్షలు వేగవంతం చేస్తామని వైద్యబృందం కలెక్టర్కు హామీనిచ్చింది.