కంది, ఆగస్టు 24: ప్రమాద రహిత రహదారులుగా నేషనల్ హైవేలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్లో జిల్లా ఎస్పీ రమణకుమార్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ఫోర్టు హైవేస్ రీజినల్ అధికారి కె.కుశ్వాహ ఆధ్వర్యంలో ‘జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణ’ అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చలో ప్రధానంగా ఎన్హెచ్-65పై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి గల కారణాలను విశ్లేషించారు. ఇదే రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్లు, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలు, నూతన సాంకేతికత ఆధారంగా రోడ్డు ప్రమాదాలను ఎలా నివారించాలో అనే విషయాలపై చర్చించారు. అదేవిధంగా పాదాచారులు రోడ్డు దాటడానికి అవసరమైన ఫుట్ఓవర్ బ్రిడ్డ్, అండర్ పాస్ల నిర్మాణం, వాటి ఏర్పాటులో ఉన్న ఇబ్బందుల వంటివాటిపై సమీక్షించారు. సూచిక బోర్డుల ఏర్పాటు, జంక్షన్ సమీపించే ముందు వాహనాల వేగాన్ని నియంత్రించడంపై వివరాలు సేకరించారు. సమావేశంలో ఆర్అండ్బీ నేషనల్ హైవేస్ ఎస్ఈ శ్రీనివాస్, ఐఐటీ ప్రొఫెసర్ దిగ్విజయ్ పవార్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, పటాన్చెరు, సంగారెడ్డి డీఎస్పీలు భీమ్రెడ్డి, బాలాజీ, సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, ట్రాఫిక్ సీఐ ముజీబ్ ఉర్ రెహమాన్, పటాన్చెరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, వేణుగోపాల్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ ఎ.చంద్రశేఖర్, మియాపూర్ ట్రాఫిక్ సీఐ ఎన్.సుమన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.