మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొని గాయపడి రోడ్డుపై పడిఉన్న ఐదుగురు బాధితులను 108 వాహనం ద్వారా దవాఖానకు తరలించి, మానవత్వం చాటుకున్నారు ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మిరుదొడ్డి మండలం ఖాజీపూర్కు చెందిన పిట్ల మల్లేశం మంగళవారం దౌల్తాబాద్ నుంచి తన కోడలు లావణ్య, మనుమల్లు ఇద్దరు నవీన్, కార్తీక్, మనుమరాలు శ్రావణిలను బైక్పై ఎక్కించుకొని ఖాజీపూర్కు వస్తున్నాడు. గ్రామ శివారులోకి రాగానే వేగంగా ఉన్న బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొన్నది. తీవ్రగాయాలపై ఐదుగురు రోడ్డుపై పడి ఉన్నారు. అదే సమయంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై పడిఉన్న బాధితులను చూసి మంత్రి తమ వాహనాన్ని నిలిపి 108 వాహనాన్ని రప్పించి బాధితులను సిద్దిపేట ఏరియా దవాఖానకు తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితుల్లో నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీ దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు.