మునిపల్లి, డిసెంబర్ 3 : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా శ్రమించాలని సంగారెడ్డి జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శనివారం మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వోదయ ఫౌండర్ సుధాకర్ నాయక్ (దాత)సహకారంతో రూ.2లక్షలతో ఏర్పాటు చేసిన పాఠశాల గ్రంథాలయాన్ని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా వినాలన్నారు. పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే మార్పు వస్తుందన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే రానిది అంటూ ఏమి లేదన్నారు. విద్యార్థులకు పలు రకాల సూచనలు, సలహాలు అందించారు. పదో తరగతిలో విద్యార్థులు ఏ విధంగా చదివితే మంచి ఫలితాలు సాధిస్తారో వివరించారు. భవిష్యత్లో ఏం కావాలి అనుకుంటున్నారు.. ఎలా సాధిస్తారు అని విద్యార్థులను అడిగారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే ఏమి చేయాలో విద్యార్థులకు కొద్దిసేపు తరగతులు నిర్వహించారు.
మునిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో సర్వదోయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.2లక్షలతో లైబ్రరీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు లైబ్రరీలు చాలా ఉపయోగపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన లైబ్రరీని విద్యార్థులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. అనంతరం సుధాకర్ నాయక్ (దాత)ను జిల్లా విద్యాధికారితో పాటు మునిపల్లి ఎం ఈవో దశరథ, పాఠశాల బృందం, విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంఈవో కార్యాలయం వద్ద అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు పలు రకాల క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీపీవో సురేశ్మోహన్, మునిపల్లి ఎంఈవో దశరథ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు, సర్పంచ్ రమేశ్, ఆయా గ్రామా ల సర్పంచులు, పాఠశాల బృందం పాల్గొన్నారు.