నారాయణఖేడ్, ఏప్రిల్ 28: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతిక్జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎంపీడీవోలు, గ్రామీణ నీటిసరఫరా తదితరశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నివాసానికి తాగు నీటి సరఫరా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, శానిటైజేషన్, సాదాబైనామాలు, భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై చర్చించారు.
ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు ఆలస్యం లేకుండా సకాలంలో చెల్లించాలన్నారు. సాదాబైనామాలు, భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. లోవోల్టేజీ, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్లైన్ల మరమ్మతులు వంటి సమస్యలు 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో సబ్కలెక్టర్ ఉమాహారతి, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీవోలు, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.