సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 23: సంగారెడ్డి జిల్లాలో రుణ లక్ష్యాన్ని ఈ నెల 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో చొరవ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాల కింద అందిస్తున్న యూనిట్లకు సంబంధించి ఎలాంటి పెండింగ్ లేకుండా వేగంగా గ్రౌండింగ్ చేయాలన్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈఈ నెలాఖరులోగా 100 శాతం గ్రౌండింగ్ పూర్తి కావాలని సంబంధిత అధికారులు, బ్యాంకర్లను ఆదేశించారు.
సమన్వయంతో లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం పంట రుణాల లక్ష్యం రూ.2,450 కోట్లు కాగా, మార్చి 20 నాటికి రూ.2482.75 కోట్లు అందించినట్టు తెలిపారు. వానకాలం లక్ష్యం రూ.1473 కోట్లకు, రూ.1392 కోట్లు, యాసంగి రుణ లక్ష్యం రూ.976.99 కోట్లకు, రూ.1089.99 కోట్ల రుణాలు అందించినట్లు వివరించారు. డీఆర్డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రూ.840 కోట్ల రుణ లక్ష్యం కాగా, రూ.857 కోట్లు అందించినట్లు వెల్లడించారు.లక్ష్యానికి మించి రుణాలు అందించినందుకు బ్యాంకర్లు, సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ గోపాల్రెడ్డి, నాబార్డ్ ఏజీఏం కృష్ణ తేజ, అధికారులు పాల్గొన్నారు.
ఇంటి వద్దకే భద్రాద్రి తలంబ్రాలు
టీఎస్ ఆర్టీసీ ద్వారా భద్రాచలం సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాల కోసం బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే వచ్చి అందించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. గురువారం టీఎస్ఆర్టీసీ ద్వారా భద్రాచల సీతారాముల కల్యాణ తలంబ్రాలను కలెక్టర్ బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎవరికైనా తలంబ్రాలు అందించేందుకు ఆర్టీసీ ముందుకొచ్చిందన్నారు. ముత్యాల తలంబ్రాల కోసం రూ.116తో బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ బసవరాజ్ పాల్గొన్నారు.బ్యాంకర్లు రుణ లక్ష్యాన్ని సాధించాలి