ఉమ్మడి జిల్లాలో 50 సహకార సంఘాల ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు పంట మార్పిడి పాటించక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఈ యాసంగిలో అన్నదాతలు పప్పుదినుసులు, నూనె దినుసుల పంటలు సాగుచేసేలా కృషిచేస్తున్నది. దీనికి గాను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించేందుకు ఆదేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నిచోట్లా నిర్వహించే ఈ సదస్సుల్లో వ్యవసాయశాఖ అధికారులతో పాటు రైతుబంధు సమితి ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి పాటించేలా చూడడం, ఈ యాసంగిలో శనగ, తెల్ల కుసుమ, నల్ల కుసుమతో పాటు పప్పుదినుసుల పంటలు సాగుచేసేలా ప్రోత్సహిస్తారు. కాగా, జిల్లా కోపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ( డీసీఎంఎస్) ఆధ్వర్యంలో శనగ విత్తనాలు పంపిణీని గురువారం జహీరాబాద్లో ప్రారంభించారు.
జహీరాబాద్, సెప్టెంబర్ 23 : యాసంగిలో అన్నదాతలు పప్పుదినుసులు, నూనె దినుసుల పంటలు సాగుచేసేలా వ్యవసాయశాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి బుధవారం వరకు వ్యవసాయశాఖ క్లస్టర్ల వారీగా గ్రామ సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తారు. రైతులు ప్రతిసారి వరి పండించడంతో నష్టపోతున్నారు. వరిసాగు గణనీయంగా పెరిగింది. దీంతో మా ర్కెట్లో వడ్లు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది. కేంద్రం దొడ్డు రకాలు కొనుగోలు చేయడానికి విముఖత చూపుతున్నది. దీంతో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తున్నది. అన్నిచోట్ల వ్యవసాయశాఖ క్లస్టర్ల పరిధిలో సదస్సులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతులు ప్రతి ఏడాది పంట మార్పిడి పాటించి అధిక దిగుబడులు సాధించేలా ప్రభుత్వం కృషిచేస్తున్నది. ఈ ఏడాది యాసంగిలో శనగ, తెల్ల కుసుమ, నల్ల కుసుమతో పాటు పప్పుదినుసుల పంటలు సాగుచేయాలని ప్రోత్సహిస్తున్నది. వారం పాటు నిర్వహించే అవగాహన సదస్సుల్లో వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం
రైతులు యాసంగిలో శనగ, తెల్లజొన్న, తెల్ల కుసుమ, నల్ల కుసుమ పంటలతో పాటు చిరుధాన్యాల పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. వరితో పాటు మార్కెట్లో డిమాండ్ లేని పంటలు సాగు చేయొవద్దని సూచిస్తున్నది. పప్పుదినుసులు, నూనె గింజల పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వాటిని సాగుచేసేలా ప్రోత్సహిస్తున్నది. వారం పాటు నిర్వహించే అవగాహన సదస్సుల్లో వ్యవసాయశాఖ ఏడీఏలు, ఏవో, ఏఈవోలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, రైతులు పాల్గొననున్నారు.
రైతులకు శనగ విత్తనాలు పంపిణీ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ( డీసీఎంఎస్) ఆధ్వర్యంలో శనగ విత్తనాల పంపిణీని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 50 సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రస్తుతం శనగ విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో శనగ విత్తనాల బస్తా 25 కిలోలు ఉంటుందని, రూ.1687. 50 కి రైతులకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.