ఝరాసంగం, సెప్టెంబర్19: మండల కేంద్రంలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరస్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 40 రోజులకు రూ.35 లక్షల 19 వేల 378 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి శశిధర్ తెలిపాడు. రెండు తెలుగు రాష్ర్టాలు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీలో వివిధ రూపాల్లో వేసిన కానుకల లెక్కింపు కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది.
కామారెడ్డి పట్టణానికి చెందిన రాజరాజేశ్వర సేవాసమితి భక్తులు, అర్చక సిబ్బంది, భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నీలాం వెంకటేశం, పాలక మండలి సభ్యులు నగేశ్, సంగన్న, నారాయణరెడ్డి, బస్వరాజ్, లక్ష్మయ్య, మాలిపాటేల్ నగేశ్ పాల్గొన్నారు. కాగా, ఝరాసంగం ఎస్ఐ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.