పల్లె ప్రగతితో కోహీర్ మండలం సజ్జాపూర్ గ్రామానికి కొత్తందాలు వచ్చాయి. పంచాయతీకి నెలనెలా నిధులు వస్తుండడంతో గ్రామ రూపురేఖలు మారాయి. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. చెత్తాచెదారం మాయమై, రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తున్నాయి. రాత్రిపూట విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో మండలంలోని సజ్జాపూర్ అభివృద్ధి వైపు దూసుకుపోతున్నది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో గ్రామం ఆదర్శంగా నిలిచింది. గతంలో రోడ్లు, మురుగు కాల్వలు ఎక్కడా చూసినా చెత్తాచెదారంతో దర్శనమించేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. గ్రామంలోని పరిసరాలను శుభ్రం చేసేందుకు పంచాయతీ ద్వారా కార్మికులను నియమించారు. రోడ్లు, మురుగు కాల్వల్లో చెత్తను తొలిగించి ట్రాక్టర్తో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పొడి, తడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. తయారైన ఎరువును ఇప్పటికే రెండుసార్లు హరితహారం మొక్కలకు వినియోగించారు. గ్రామంలో ఇండ్లు 305, జనాభా 1453, ఓటర్లు900, వార్డులు8 ఉన్నాయి. రెండు మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకులు, మూడు చిన్న ట్యాంకులు ఉన్నాయి.
సజ్జాపూర్ శివారులో నిర్మించిన వైకుంఠధామం జిల్లాలో ప్రసిద్ధి చెందింది. వైకుంఠధామం ఆవరణలో ఏకశిలతో రూపొందించిన శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వైకుంఠధామం చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. ఇందులో మూడు వరుసల్లో 1300 హరితహారం మొక్కలు నాటారు. అక్కడికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అంత్యక్రియలకు వచ్చే వారు సేద తీరేందుకు కుర్చీలను కూడా ఏర్పాటు చేయించారు. వైకుంఠధామంలో 1300 మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా 800 మొక్కలు, పల్లెప్రకృతి వనంలో 2000 మొక్కలను నాటారు.
పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను సేకరించి యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఎరువు తయారు కావడానికి వానపాములను వదిలారు. రెండుసార్లు తయారు చేసిన ఎరువును హరితహారం మొక్కల ఎదుగుదలకు ఉపయోగించారు. ఇటీవల మంత్రి హరీశ్రావు సేంద్రియ ఎరువును పరిశీలించి సంతృప్తి చెందారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. రెండు వేల మొక్కలతో పల్లెప్రకృతివనం కూడా ఆహ్లాదాన్ని పంచుతున్నది. రోడ్డుకు ఇపువైపులా నాటిన 800 హరితహారం మొక్కలు ఏపుగా పెరిగాయి. గ్రామం మొత్తం ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది.
వైకుంఠధామాన్ని అందంగా తయారు చేసినం. కలెక్టర్ హనుమంతరావు వచ్చి చూ శాడు. చాలా సంతృప్తి చెంది గ్రామాభివృద్ధి కోసం రూ.10లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో గ్రామంలో కాల్వలను నిర్మించినం. గ్రామాభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యే రూ.10 లక్షల చొప్పున కేటాయించారు.
– సుదర్శన్రెడ్డి, ఉప సర్పంచ్, సజ్జాపూర్
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి చేసి నం. గ్రామంలో చేపట్టిన పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి హరీశ్రావు అభినందించారు. బీసీ, ఎస్సీ, క మ్యూనిటీ భవన నిర్మాణాలు, కాల్వ లు, సీసీ రోడ్లకు నిధులు కేటాయిస్తామని హామీనిచ్చారు.
– వెంకట్రెడ్డి, మండల పంచాయతీ అధికారి