సంగారెడ్డి, జనవరి 11: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ రీజియన్ నుంచి తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. పండుగకు మూడు రోజులపాటు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఈనెల 12, 13, 14 తేదీల్లో సొంత గ్రామాలు, పట్టణాలకు వెళ్లేందుకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు అధికారులు బస్సులను సిద్ధం చేశారు. పండుగకు వివిధ ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాణం చేస్తారు. అలాంటివారి కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 110 బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. బస్సులను హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు పలు ముఖ్యమైన ప్రదేశాలకు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 8 ఆర్టీసీ డిపోల నుంచి దూర ప్రాంతాలకు బస్సులు నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రస్తుత చార్జీలతోనే ప్రయాణం చేసేవిధంగా సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడిపించేందుకు చర్యలు చేపట్టారు. అదనపు చార్జీలు లేకుండా ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంక్రాంతికి వేసిన ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి చార్జీలు పెంచలేదు. రాష్ట్రంలోని దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యానికి ఇబ్బందులు కలుగకుండా అవసరమైతే అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెదక్ డిపో నుంచి 12 బస్సులు, నారాయణఖేడ్ నుంచి 10, నర్సాపూర్ నుంచి 9, సంగారెడ్డి నుంచి13, జహీరాబాద్ నుంచి15, సిద్దిపేట్ నుంచి 27, గజ్వేల్-ప్రజ్ఞపూర్ నుంచి 15, దుబ్బాక డిపో నుంచి 9 బస్సులు నడుస్తాయని అధికారుల తెలిపారు.
ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఏ బస్సు చూసినా మహిళలతో నిండిపోతున్నది. సంక్రాంతి పండుగకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవడంతో మరింత రద్దీ పెరుగనున్నది. సంక్రాంతి పండుగకు తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాలకు మెదక్ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ఈ బస్సులు ఈనెల 12 నుంచి14 వరకు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పరిధిలో నడిచే 110 బస్సులు జూబ్లీ బస్స్టేషన్, ఇమ్లీబన్ బస్స్టేషన్, లింగంపల్లి నుంచి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అలాగే లింగంపల్లి నుంచి జహీరాబాద్, మెదక్, నారాయణఖేడ్, పిట్లం, బిచుకుందలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ మెదక్ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి.