కొమురవెల్లి చంద్రశేఖర్ సిద్దిపేట, మే 29: యాసంగి 2023కు సంబంధించి లక్ష 75వేల మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం, యాసంగి 2024కు సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధం గా ఉన్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కరోనా కంటే ముందు మిల్లర్లకు అప్పజెప్పిన ధాన్యం మరాడించి ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు. తదనంతరం 2021-22లో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మిల్లుల కెపాసిటికి మించి ధాన్యం దిగుమతి చేసినట్లు తెలిపారు. అప్పటి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యతలేని కారణంగా, దీనికి మరాడించిన బియ్యం దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద సరైన స్థలం లేక మిల్లర్ల వద్దే ఆ బియ్యం ఉండిపోయిందన్నారు. స్థలాభావం కారణంగా యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్ దిగుమతి కోసం ఒకొక్క లారీ 3రోజులపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లా పరిధిలో సుమారు 150 మిల్లులకు సంబంధించి రూ.100 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా 2023 యాసంగికి సంబంధించి టెండర్ ధాన్యం నిల్వ ఉంచిన నేపథ్యంలో తరుగు, హమాలీ, గోదాం కిరాయి కలుపుకొని క్వింటాల్కు రూ.500 మిల్లర్లుకు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2019 వరకు జిల్లాలో 75వేట మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా 2024 వచ్చే సరికి పంట దిగుబడి 4లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ గోదాముల సంఖ్య పెరగలేదన్నారు. సమావేశంలో సెక్రటరీ బుచ్చయ్య, వైస్ ప్రెసిడెంట్ బాలకిషన్ రావు, జాయింట్ సెక్రటరీ శివకుమార్, మాజీ కోశాధికారి ఉప్పల భూపతి, అడ్వైజర్ కాశీనాథ్, మిల్లర్ మద్ది శంకర్ తదితరులు పాల్గొన్నారు.