మెదక్ : జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోళ్లు ( Paddy Procurement ) విజయవంతం గా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ( Collector Pratima Singh ) వెల్లడించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు . జిల్లా చరిత్రలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో రైతులు గతంలో కంటే 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారని వివరించారు.
జిల్లాలో 4,28,361 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ పూర్తి అయిందన్నారు. రైతుల అకౌంట్లలో రూ.1005.66 కోట్లను జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరణ చేశామని వివరించారు. ఏప్రిల్ 08 న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లు జూన్ 27వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, పీఏసీఎస్ -305, ఐకేపీ-185, డీసీఎంఎస్- 43 కేంద్రాల ద్వారా కొనుగోలు జరిపామన్నారు.
జొన్నలు కొనుగోలు చేస్తాం..
జిల్లాలో జొన్న రైతులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని, జొన్నల కొనుగోళ్ల గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని రైతులకు జిల్లా కలెక్టర్ సూచించారు. శుభ్రంగా ఉన్న జొన్నల్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 3,609 మంది రైతుల నుంచి 6,347 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేసామన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందo, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్ , జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డీపీఆర్వో రామచంద్ర రాజు తదితరులు పాల్గొన్నారు.