వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతులు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నది. సకాలంలో ఎరువులు విత్తనాలు, పంట పెట్టుబడి, 24 గంటల నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోళ్లు ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది. తాజాగా రైతుల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. అర్హత పొందిన ప్రతి రైతుకు రూ. 96 వేల వరకు రుణమాఫీ చేస్తామనడంపై కర్షకులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతన్నలకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తుండడంతో రైతులు ఖుషీగా ఎవుసం చేసుకుంటున్నారు. ఇవ్వాళ సాగునీటికి కొరత లేకుండా పోయింది. మండు వేసవిలోనూ చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపుతున్నారు. పడావు భూములు సైతం సాగులోకి వచ్చాయి.
-సిద్దిపేట, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో రైతులు బతుకులు మారుతున్నాయి. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రైతు విత్తనం నాటిన నుంచి చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ రైతులకు దన్నుగా నిలువడంతో వారంతా ఖుషీగా ఎవుసం చేసుకుంటున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి, నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోళ్లు, రైతుల కల్లాలు.. ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది.
తాజాగా రైతుల రుణమాఫీకి ప్రభుత్వం బడ్జెట్లో నిధులను కేటాయించింది. అర్హత పొందిన ప్రతి రైతుకు రూ. 96 వేల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడంతో అన్నదాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవలే యాసంగికి 10 విడత రైతుబంధు అందించింది. రైతుబీమా ద్వారా రూ. 5 లక్షల పరిహారం అందిస్తున్నది. సాగునీటికి కొరత లేకుండా చేసింది. మండు వేసవిలోనూ చెరువులు, కుంటలను గోదావరి జలాలతో నింపుతున్నది. దీంతో వ్యవసాయం పండుగలా మారింది.
కాళేశ్వరంతో పుష్కలంగా నీరు..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి ప్రతి చెరువు, కుంట, చెక్డ్యామ్లను నింపడంతో భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పడావు భూములు సైతం సాగులోకి వచ్చాయి. రైతులకు ఆధునిక పద్ధతులు తెలియజేయడానికి ప్రతి వ్యవసాయ క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. ఈ వేదికలో రైతలు సమావేశమై పంటల సాగు, మార్కెట్ విధానం తదితర అంశాలపై చర్చించుకుంటున్నారు. ఇలా ప్రభుత్వ చేయూతతో రైతులు పండుగలా ఎవుసం చేసుకుంటున్నారు.
రైతుబంధుతో తప్పిన తిప్పలు
సీఎం కేసీఆర్ రైతులకు పది విడతలుగా(ప్రస్తుత యాసంగిని కలుపుకొని) రైతుబంధు అందించారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటి వరకు పది విడతల్లో రైతులకు అందిన సాయం ఇలా ఉంది. సిద్దిపేట జిల్లాలో 26,12,573 రైతులకు రూ.2,810.86 కోట్లు, మెదక్ జిల్లాలో 22,10,786 రైతులకు రూ.1,833.32 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 28,35,791 రైతులకు రూ. 3,208.09 కోట్లు నేరుగా వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేసింది. దీంతో రైతులకు పెట్టుబడులకు తిప్పలు తప్పాయి. పంట పెట్టుబడుల కోసం రైతులు ఎదురు చూడకుండా విత్తు విత్తక ముందే సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలు అందించి అన్నదాతకు ఈ ప్రభుత్వం దన్నుగా నిలుస్తుంది.
ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు, దున్నకం ఖర్చులకు వినియోగించుకుంటున్నారు. బ్యాంకులు పంట రుణాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు ఎకరానికి రూ. 20 వేల పంట రుణం ఇచ్చిన బ్యాంకులు, ఇప్పుడు ఎకరానికి రూ. 50 వేలకు పైగా పంట రుణాలు ఇస్తున్నాయి. రైతులపై బ్యాంకులకు నమ్మకం పెరిగింది. గ్రామాల్లోనే చిన్న చిన్న బ్యాంకులు ఏర్పాటు చేసి అరగంటలో పంట రుణాలు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారు.
త్వరలోనే రైతులకు రుణమాఫీ
రాష్ట్ర బడ్జెట్లో పంట రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో రైతులు ఖుషీగా ఉన్నారు. అర్హత కలిగిన రైతులకు రూ. 96 వేల వరకు రుణమాఫీని త్వరలోనే చేపట్టనున్నారు. ఇప్పటికే రెండు విడతలుగా రుణమాఫీని ప్రభుత్వం చేసింది. ఉమ్మడి జిల్లా మెదక్ వ్యాప్తంగా ఎంతమందికి రుణమాఫీ కానున్నదన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే లెక్కలు తీశారు. ఆ లెక్కల ప్రకారం సిద్దిపేట జిల్లాలో 1,67,771 మంది రైతులు అర్హులు కాగా, ఇప్పటి వరకు రూ. 25వేలలోపు రుణం పొందిన వారు 20,146 మంది రైతులకు రూ. 27.14 కోట్లు, రూ.50వేలలోపు రుణం పొందిన 24,600 మంది రైతులకు రూ.87.0 కోట్లు మాఫీ చేసింది. మిగతా అర్హులైన లక్ష రూపాయలు తీసుకున్న వారికి రుణం పూర్తిగా మాఫీ కానున్నది.
మెదక్ జిల్లాలో రుణమాఫీకి 1,53,883 మంది అర్హులు కాగా, వీరిలో ఇప్పటి వరకు 25వేలలోపు వారు 22,097మంది రైతులకు రూ.34.12 కోట్లు, రూ. 50 వేలలోపు ఉన్న 24,200 మందికి 85.0 కోట్లు మాఫీ చేసింది.మిగిలిన వారికి రుణమాఫీ కానున్నది. సంగారెడ్డి జిల్లాలో 1,90.002 మంది రైతులు అర్హులు కాగా, ఇప్పటి వరకు రూ. 25 వేలు మాఫీ అయిన వారు 20,503 మంది రైతులకు రూ. 30.53 కోట్లు, రూ. 50వేల వరకు 24,765 మంది రైతులకు రూ. 89.2 కోట్లు మాఫీ చేసింది.
ప్రభుత్వ ప్రోత్సాహంతోనే సాగుచేశా..
మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏడాదిన్నర క్రితం ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆయిల్పామ్ సాగుచేశా. అందులో అంతర పంటలుగా కంది, టమాట సాగుచేశా. ప్రస్తుతం ఆయిల్పామ్ పంట బాగానే ఉంది. మూడేండ్లు కష్టపడి పంట కాపాడితే 30 ఏండ్ల వరకు దిగుబడి రానుండడం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. చాలామంది రైతులు ఆయిల్పామ్ సాగుకు ముందుకొస్తున్నారు.
– గడ్డం పద్మ, మహిళా రైతు, చాట్లపల్లి , గజ్వేల్ మండలం