ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిని అందమైన నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం చేశామని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫోర్ లేన్ రోడ్డును నిర్మించిన కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల భద్రతను విస్మరించింది. వసతుల సౌకర్యార్థం టోల్ చార్జీలు ముక్కు పిండీ వసూలు చేస్తున్న జాతీయ రహదారి అధికారులు అరకొర వసతులతో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు. టోల్ చార్జీని మరింత పెంచి వసూలు చేయడంపై వాహనదారులు మండిపడుతున్నారు.
జహీరాబాద్/ కోహీర్, మే 14: సంగారెడ్డి జిల్లాలోని ముంబయి- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. రహదారిని నిర్మించి, ప్రయాణికుల భద్రతను మరిచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వసతులు మున్నాళ్ల ముచ్చటగా మారా యి. కోహీర్ మండలంలో ఐదేండ్ల క్రితం 65వ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సంగారెడ్డి నుంచి మహారాష్ట్రలోని షోలాపూర్ వరకు జాతీయ రహదారి పనులు చేపట్టారు. కానీ దిగ్వాల్, కొత్తూర్(డి) గ్రామాల్లో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జాతీయ రహదారి సమీపంలోని ప్రతి గ్రామంలోనూ వంతెన నిర్మించాల్సి ఉన్నా దిగ్వాల్ గ్రామంలో నిర్మించలేదు. ముంబయి, షోలాపూర్, గుల్బర్గా, బీదర్, తదితర దూర ప్రాంతాలకు వాహనాలు గంటకు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తుంటాయి.
ప్రజల ప్రాణాలపై కనికరం లేని కేంద్రం
కోహీర్ మండలంలోని దిగ్వాల్, కొత్తూర్, వెంకటాపూర్, కవేలి, మద్రి జాతీయ రహదారిపై ఐదేండ్లలో వేర్వేరు ప్రమాదాల్లో 30 మందికి పైగా మృతిచెందారు. కార్మికులు స్థానిక పరిశ్రమల్లో పనులు చేస్తుంటారు. అక్కడ పనులు ముగించుకుని రాత్రుల్లో తిరిగి తమ ఇండ్లకు వస్తుంటారు. కానీ రోడ్డు నిర్మాణం సరిగా లేనందున ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది.
ముక్కుపిండి టోల్ వసూలు
సంగారెడ్డి జిల్లాలో 70 కిల్లోమీటర్లు జాతీయ రహదారిని నిర్మించి కంకోల్ వద్ద టోల్ గేట్ ఏర్పాటు చేశారు. 65వ జాతీయ రహదారిని సంగారెడ్డి చౌరస్తా నుంచి జహీరాబాద్ మండలంలోని చెరాగ్పల్లి సరిహద్దు వరకు నాలు గు లేన్లు నిర్మించారు. మెరుగైన సౌకర్యాలు కలిపించేం దుకు సర్వీస్ చార్జీగా టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. వసతుల పేరిట జాతీయ రహదారి అధికారులు టోల్ ఫీజును ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. టోల్ ఫీజు మరింత పెంచడంతో వాహనదారులు మండిపడుతున్నారు. కొన్నేళ్లుగా రోడ్డుపై సౌకర్యలు లేవని ప్రయాణికులు ప్రశ్నిస్తే దాడికి దిగుతున్నారు.
అడుగడుగునా లోపాలే..
65వ జాతీయ రహదారి నిర్మాణంలో ఆడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. అవసరం ఉన్న చోట కాకుండా వేరే చోట్ల సర్వీస్ రోడ్లు నిర్మించడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల సమీపంలో యూటర్న్లు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపై నుంచే దాటాల్సిన పరిస్థితి ఉంది. దీంతో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నాయి. జహీరాబాద్ సమీపంలోని అల్గోల్ చౌరస్తా వద్ద ప్రతి రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా, నివారణ చర్యలు తీసుకోవడం లేదు. అల్గోల్ చౌరస్తా నుంచి పస్తాపూర్ సర్వీస్ రోడ్డులో పార్కింగ్కు అనుమతి లేకున్నా వాహనాలు నిలుపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అల్గోల్ చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పలు గ్రామాలకు చెందిన ప్రజలు అల్గోల్ చౌరస్తా వద్ద ధర్నాలు చేసినా అధికారులు స్పందించడంలేదు. జాతీయ రహదారి పక్కన రియల్టర్లు అక్రమంగా రోడ్లు నిర్మించినా అధికారులు పట్టించుకోవడంలేదు.
ప్రజల ప్రాణాలను కాపాడాలి
దిగ్వాల్ గ్రామంలో చాలా రోడ్డు ప్ర మాదాలు జరుగుతుంటాయి. రోడ్డు దాటాలంటే చాలా కష్టంగా ఉంటుం ది. వాహనాల స్పీడుకు శరీరం అంతదూరంలో పడి ముక్కలు కావాల్సిందే. ఐదేైండ్లెనా ఇంత వరకు సర్వీస్ రోడ్డు కూడా పూర్తి చేయలేదు. వెంటనే స్పందించి పనులన్నీ పూర్తి చేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలి.
– నారాయణరెడ్డి, వాహనదారుడు, దిగ్వాల్
వాహనాలు వేగంగా వెళ్తాయి
65వ జాతీయ రహదారిపై వాహనా లు అతి వేగంగా వెళ్తుంటాయి. దీం తో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐదేండ్లలో ఇంతవరకు 30 మందికి పైగా మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డుపై స్టాపర్లను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. దీంతో వాహనాల స్పీడు తగ్గుతుంది. ప్రమాదాలు కూడా తగ్గుతాయి. స్థానిక ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలి.
– సురేశ్, ఎస్సై, కోహీర్