సిద్దిపేట రూరల్, జనవరి 25: పరాయి పాలనలో వారు రోడ్డు పక్కన గుడిసెలు, షెడ్లు వేసుకొని కుటుంబాలను నెట్టుకొచ్చారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారికి పక్కా ఇండ్లు కట్టించి ఇవ్వలేకపోయాయి. స్వరాష్ట్రంలో వారి సొంతింటి కల సాకారమవుతోంది. సీఎం కేసీఆర్ పుణ్యమా అని సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లోని ముస్తాబాద్-కామారెడ్డి రోడ్డులో నివాసం ఉంటున్న పిట్టల కులస్తులకు గృహ యోగం కలిగింది. పిట్టలవాడలో నివసిస్తున్న 13 మందికి మంజూరైన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. త్వరలో వారికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ఇండ్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూరి గుడిసెల్లో నివాసం…
పిట్టలవాడలో 13 కుటుంబాలు ఏళ్లుగా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని నివాసం ఉంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీరి సొంతింటి కల నెరవేరబోతోంది. మంత్రి హరీశ్రావు కృషి ఫలితంగా 13 కుటుంబాలకు అద్భుతమైన ఇండ్లు అందుబాటులోకి రానున్నాయి. వాస్తు ప్రకారం చక్కటి ఇండ్లు నిర్మించారు. ఒక్కో ఇంటికి సుమారు రూ.5.45 లక్షలు వెచ్చించారు.
గతంలో ఇళ్ల నిర్మాణాన్ని తెలుసుకున్న కశ్మీర్ సభ్యులు రాఘవాపూర్ పంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను ఇటీవల కశ్మీర్ నుంచి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. వీటి నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతున్న వివరాలు తెలుసుకొని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఉచితంగా ఇళ్లను నిర్మించి ఇవ్వడం లేదని, పేదల కోసం సీఎం కేసీఆర్, స్థానిక మంత్రి హరీశ్రావు తీసుకుంటున్న చొరవ అభినందనీయమని కొనియాడారు.
పిట్టలవాడలోని 13 ఇండ్లకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం చేసింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చింది. 24 గంటలపాటు నిత్యం నీటి సరఫరా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
త్వరలో పంపిణీ చేయనున్న మంత్రి
రాఘవాపూర్లోని పిట్టలవాడలోని 13 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంది. మంచినీటి కోసం మిషన్ భగీరథ ట్యాంకు నిర్మాణం, ఇంటింటికీ నల్లా కనెక్షన్, సీసీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయిస్తాం. త్వరలో పంపిణీకి అన్ని పనులు పూర్తవుతాయి.
– ఎం.వెంకటాచార్యులు, పీఆర్ఏఈ, సిద్దిపేటరూరల్ మండలం
నయాపైసా లేకుండా ఇళ్ల నిర్మాణం
పేదలపై భారంపడకుండా తెలంగాణ ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి ఇళ్లను నిర్మిస్తోంది. దశల వారీగా డబుల్ బెడ్రూం ఇండ్ల అందజేత కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకు ఎంతోమందికి ఇంటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటాం.
– శ్రీహరిగౌడ్, జడ్పీటీసీ, సిద్దిపేట రూరల్
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
పేదలను ధనవంతులను చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పని చేస్తోంది. ఇన్నాళ్లు గుడిసె జీవితం గడిపిన పిట్టలవాడవాసులకు శాశ్వత గూడు దక్కనుంది. లక్షలు ఖర్చుచేసి పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడం దేశంలో ఎక్కడా లేదు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు.
– మారెడ్డి రవీందర్రెడ్డి, సుడా చైర్మన్
పేదలు సంతోషంగా ఉండాలనేదే మంత్రి లక్ష్యం
పేదలు సంతోషంగా జీవితం గడపాలనేదే మంత్రి హరీశ్రావు లక్ష్యం. అందుకే వారి సంక్షేమం కోసం రోజూ ఆలోచిస్తారు. ఇన్నాళ్లు గుడిసెల్లో ఉన్న పిట్టలవాడవాసులకు శాశ్వత ఇల్లు గొప్ప ఆస్తిగా మిగిలిపోతుంది. ఇదంతా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఘనత.
– గన్నమనేని శ్రీదేవిరాంచందర్రావు, ఎంపీపీ, సిద్దిపేటరూరల్
మంత్రికి రుణపడి ఉంటాం
మంత్రి రుణపడి ఉంటాం. పిట్టలవాడ వాసులకు శాశ్వత ఇంటి నిర్మాణం వారి అదృష్టం. ఇన్నాళ్లూ గుడిసెల్లో వారు చాలా ఇబ్బందిపడ్డారు. మిగతా పనులు పూర్తయితే ఇంటి కల నెరవేరుతుంది. పేదల తరపున మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– రమేశ్, రాఘవాపూర్ సర్పంచ్