మద్దూరు (ధూళిమిట్ట), జనవరి 13 : మద్దూరు మండలంలోని రేబర్తి రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 25 వరకు కొనసాగనున్నాయి. ఏటా సం క్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగులతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల 15న ఆల యం చుట్టూ బండ్లు తిరగడం, ఆలయం నుంచి గ్రామం చుట్టూ ప్రభ బండ్ల ఊరేగింపు కనుల పండువగా నిర్వహించనున్నారు.
తొమ్మిది రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం రామలింగేశ్వరస్వామి పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఈ నెల 25న భ్రమరాంబిక సహిత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ సవితాచంద్రశేఖర్ తెలిపారు. అదేరోజు రాత్రి గ్రామంలో స్వామి వారి రథోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సర్పంచ్ కోరారు.