భక్తుల కొంగుబంగారం రేజింతల్ సిద్ధివినాయకుడి సేవలో భక్తజనం తరిస్తున్నది. స్వామివారి జయంతోత్సవాలు వైభవంగా కొనసాగుతుండగా.. పార్వతి తనయుడికి వేదపండితులు, అర్చకులు, భక్తులు విశేష పూజలు చేస్తున్నారు. సిద్ధివినాయక.. బుద్ధి ప్రదాత అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు స్వామివారినిదర్శిం చుకుంటున్నారు.
న్యాల్కల్, డిసెంబర్ 26 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రేజింతల్లోని స్వయంభూ సిద్ధివినాయక స్వామివారి జయంతోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల మూడో రోజైన సోమవారం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్యర్యంలో ఉదయం ఆలయంలో వేద పండితులు స్వామివారికి అభిషేకం, గణపతి హవనం, శతచండీ హవనం, మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తుల దర్శనానికి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ, హద్నూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీడీవో సుమతి, బీఆర్ఎస్ నాయకులు నామ రవికిరణ్ గుప్తా, మండల నాయకులు భాస్కర్, రాజేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శారద భాస్కర్రెడ్డి, రేజింతల్ గ్రామ సర్పంచ్ కుతుబుద్దీన్ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు శాలువాలు కప్పి సత్కరించారు. ఆలయ కమిటీతో పాటు పలువురు దాతలు కలిసి భక్తులకు అన్నదానం చేశారు.
కార్యక్రమాల్లో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు అల్లాడి వీరేశం, ఆధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు రేజింతల్ అశోక్, అల్లాడి నర్సింలు, కమిటీ సభ్యలు కొబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, ఉల్లిగడ్డ బస్వరాజ్, రాజేశ్వర్, రాజ్కుమార్, మేనేజర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేడు ఆలయానికి రానున్న మంత్రి తన్నీరు హరీశ్రావు…రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మంగళవారం రేజింతల్ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ అభివృద్ధికి మంజూరైన రూ.2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేయనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ రేజింతల్, అల్లాడి నర్సింలు తెలిపారు. మంత్రితో పాటు ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ తదితరులు హాజరు కానున్నారని తెలిపారు.
మంత్రి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను జడ్పీ సీఈవో ఎల్లయ్య, జడ్పీటీసీ స్పప్నకుమారి, ఎంపీడీవో సుమతి, బీఆర్ఎస్ మండల నాయకులు భాస్కర్, రాజేందర్రెడ్డి, సిద్దారెడ్డి, రేజింతల్ గ్రామ సర్పంచ్ కుతుబుద్దీన్ పరిశీలించారు. మంత్రి హరీశ్రావు పర్యటనకు మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జడ్పీటీసీ స్వప్నకుమారి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవీందర్ కోరారు.
సిద్ధి వినాయక ఆలయ అభివృద్ధికి కృషి
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా
న్యాల్కల్, డిసెంబర్ 26: మండలంలోని రేజింతల్ సిద్ధి వినాయక ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హామీ ఇచ్చారు. సోమవారం ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మండల జడ్పీటీసీ స్వప్నకుమారి, బీఆర్ఎస్ మండల నాయకులు భాస్కర్, రాజేందర్రెడ్డి, గుండారెడ్డి, మదన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సుధాకర్రెడ్డి, రేజింతల్ సర్పంచ్ కుతుబుద్దీన్ కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు.
సిద్ధివినాయక స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున వస్తారని, అందుకోసం ఆలయ ప్రాంగణంలో అతిథి గృహం, హరిత హోటల్ను ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఆలయం వరకు ప్రత్యేక బస్సును నడిపించేలా చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రాన్ని అందజేశారు. సంబంధిత మంత్రి శ్రీనివాస్గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.