సంగారెడ్డి, జూలై 22 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించడంతోపాటు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అంతటా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటుంది. జిల్లాలో శనివారం 426.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుమ్మడిదల మండలంలో 55.1 మి.మీటర్ల వర్షం కురవగా అత్యల్పంగా కంగ్టిలో 6.1 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈనెలలో 132.7 మి.మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 322.4 మి.మీటర్ల వర్షం కురిసింది. సాధారణం కంటే 142.9 మి.మీటర్ల వర్షం అధికంగా కురిసింది.
గతనెలలో కంటే 218 మి.మీటర్ల వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అయితే గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఈనెల ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూలైలో జిల్లాలో 458.8 మి.మీటర్ల వర్షం కురిసింది. ఇదిలాఉంటే శనివారం సంగారెడ్డి జిల్లాలో 17మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 11 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. జిన్నారం మండలంలో 52.6 మి.మీటర్లు, చౌటకూరులో 43.4, మొగుడంపల్లిలో 36.6, మునిపల్లిలో 35.0, హత్నూరలో 34.3, కోహీర్లో 31.5, జహీరాబాద్లో 31.0 మి.మీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో 10 నుంచి 25 మి.మీటర్లలోపు వర్షపాతం నమోదైంది.
నీట మునిగిన పంటలు
జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో 743 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా వట్పల్లి, రాయికోడ్, మునిపల్లి, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, న్యాల్కల్, జహీరాబాద్ మండలాల్లో 743 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 413 ఎకరాల్లో పత్తి, 94 ఎకరాల్లో కంది, 132 ఎకరాల్లో సోయాబీన్, 16 ఎకరాల్లో మినుము, 18 ఎకరాల్లో మొక్కజొన్న, 70 ఎకరాల్లో చెరుకు పంటలు నీట మునిగాయి. అయితే రైతుల అప్రమత్తతో 80 శాతం పంటలు రికవరీ అయినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. పంటలు నీట మునిగిన వెంటనే రైతులు కాల్వలు తీసి నీటిని పొలం నుంచి బయటకు పంపడంతో 80శాతానికిపైగా పంటలు రికవరీ అయినట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నర్సింహరావు తెలిపారు.
వర్షాలతో దెబ్బతిన్న ఇండ్లు, రోడ్లు
వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. జిల్లాలో మొత్తం 10ఇండ్లు పూర్తి, 210 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మునిపల్లి మండలం అంతారం గ్రామంలో కూలిపోయిన ఇండ్లను ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పరిశీలించారు. బాధితులతో వివరాలు తెలుసుకుని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే వర్షాలతో సంగారెడ్డి జిల్లాలో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా కోహీర్ మండలంలోని హుగ్గెల్లి-పీచేరాగడి పంచాయతీరాజ్ రహదారి 3.6 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నది. అలాగే వట్పల్లి మండలం బిజిలీపూర్లోని ఆర్అండ్బీ కల్వర్టు, సంగుపేట-పోచారం రోడ్డులో కల్వర్టు దెబ్బతిన్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని గౌసాబాద్-మాడ్గి మధ్య ఉన్న కల్వర్టు వర్షాలతో దెబ్బతిన్నది. వీటి మరమ్మతు పనులకు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రాజెక్టుల్లోకి కొనసాగుతున్న వరద
వర్షాలతో సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులోకి వరద కొనసాగుతున్నది. శనివారం సింగూరు ప్రాజెక్టులోకి 6,403 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 20.794కు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 29.917 టీఎంసీలు. మళ్లీ భారీ వర్షాలు పడితే సింగూరు ప్రాజెక్టు నిండే అవకాశం ఉన్నది. సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులోకి 1150 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం 655.425 ఎంపీఎఫ్టీకి చేరుకుంది. జహీరాబాద్ సమీపంలోని నారింజ ప్రాజెక్టులోకి వరద తగ్గింది. దీంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశారు.