నారాయణఖేడ్, ఫిబ్రవరి 28: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్గా 6వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ స్వరూప్ షెట్కార్ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న రుబీనాబేగం నజీబ్పై ఈనెల 2న ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో బుధవారం నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఇన్చార్జి ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ వసంతకుమారి మాట్లాడుతూ.. 15 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 18 మందికి 11 మంది కౌన్సిలర్లు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతుతో చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైందన్నారు.వైస్ చైర్మన్గా 3వ వార్డు కౌన్సిలర్ దారం శంకర్ ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈ మేరకు చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణస్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఎక్స్ అఫీషియో సభ్యునిగా హాజరైన ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కొత్త పాలకవర్గం కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు. మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్తో పాటు మున్సిపల్ సిబ్బంది చైర్మన్, వైస్ చైర్మన్లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.