తెల్ల బంగారంగా పిలువబడే పత్తి కొనుగోళ్లు సిద్దిపేట జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. దళారుల బారిన పడి పత్తి రైతులు మోసపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 22 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే కనీస మద్దతు ధర పెరిగింది. గతేడాది క్వింటాల్ పత్తికి రూ.6300 మద్దతు ధర ఉండగా, ఈ ఏడాది రూ.7020గా నిర్ణయించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో కోత విధిస్తుండడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. మరోవైపు వ్యాపారులు రూ.6400 నుంచి రూ.6700 వరకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 1.65 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది 1.08 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగైంది.
గజ్వేల్, డిసెంబర్ 10: పత్తి పంటను విక్రయించేందుకు జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆశించిన ధర దక్కక రైతులు దిగులు చెందుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో కోత విధించడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. దీంతో ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే సరైన ధర రాకపోవడంతో రైతులు ఇండ్లలోనే నిల్వ చేసుకుంటున్నారు. రోజు రోజుకు పత్తి ధర తగ్గుతున్నది. నెల రోజుల క్రితం క్వింటాల్కు రూ.7వేలు ఉంటే ప్రస్తుతం రూ.6500 మించి పలకడం లేదు. సీసీఐ కేంద్రాల్లో (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 1.65 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా అందులో లక్ష క్వింటాళ్ల వరకు ప్రైవేట్ వ్యాపారులే కొనుగోలు చేశారు. జిల్లాలో ఈ సంవత్సరం 1.08లక్షల ఎకరాల్లో రైతులు పతి పంట సాగు చేశారు. గత సీజన్లతో పోల్చితే ఈ సారి వాతావరణ పరిస్థితుల కారణంగా పంటసాగులో నష్టం వాటిళ్లడంతో తక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎకరాకు పది క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా తగ్గే అవకాశం ఉంది.
ప్రభుత్వం పత్తికి గతేడాది రూ.6080 నుంచి రూ.6380 వరకు ఉండగా ఈ సారి ప్రభుత్వం రూ.7020 వరకు నిర్ణయించి కొనుగోలు చేస్తుంది. తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతనే ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. పత్తి కొనుగోళ్ల ప్రారంభంలో ధరను క్వింటాల్కు బహిరంగ మార్కెట్లో రూ.7వేల వరకు పలికింది. పత్తి ధర పెరుగుతుందని రైతులు ఆశించినా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పడిపోయాయి. దీంతో ధరలు తగ్గాయని వ్యాపారులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.7020 పొందడానికి సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్లి అమ్ముకుందామంటే తేమ పేరుతో అక్కడ రూ.6700మించి ధర రాకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో సిద్దిపేట, తొగుట, దౌల్తాబాద్, కొండపాకలో ఒక్కొక్కటి చొప్పున బెజ్జంకిలో రెండు, హుస్నాబాద్లో నాలుగు, గజ్వేల్లో ఆరు, చేర్యాలలో ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఇప్పటి వరకు 65వేల పైచిలుకు క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు తరుగు పేరుతో కొత విధిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది అత్యధికంగా క్వింటాల్కు రూ.9వేల వరకు ధర పలకడంతో రైతులు సంతోషంతో విక్రయించారు.
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో అధికారులు ఆరు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. క్వింటాల్కు రూ.7020గా సీసీఐ ధర నిర్ణయించింది. తేమ 8శాతం ఉంటే రూ.7020, 12శాతం వరకు ఉంటే రూ.6 700గా ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో 18 వేల క్వింటాళ్ల పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేశారు. గజ్వేల్లోని నాలుగు మిల్లు ల్లో ప్రైవేట్ వ్యాపారులు 28వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేట్ వ్యాపారులు రూ. 6400 నుంచి రూ.6700 వరకు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. గజ్వేల్ పరిధిలోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన పత్తి చాలా వరకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు.