తూప్రాన్, డిసెంబర్ 30: తూప్రాన్ పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. అందుకనుగుణంగా ప్రభుత్వ స్థలం కూడా అందుబాటులో ఉండటంతో ప్రజల సౌకర్యార్థం బస్డిపో ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రతిపాదనలు పంపడానికి పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించి, ఆమోదించింది. తూప్రాన్ మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్గౌడ్ అధ్యక్షతన శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హాజరై తూప్రాన్ పట్టణ అభివృద్ధి, పురోగతిలో ఉన్న పలు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎజెండాలో పేర్కొన్న పలు అభివృద్ధి పనులపై చర్చించారు. అందులో ప్రధానంగా పాత నర్సాపూర్ క్రాస్రోడ్డు నుంచి పోతరాజ్పల్లి గాంధీ విగ్రహం వరకు, డబుల్ బెడ్రూం బీటీ రోడ్ నుంచి బ్లాక్ నెం.3 వరకు మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా చెట్లు నాటేందుకు తీర్మానించారు.
మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో ఆర్డీవో కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మించడంతో పాటు అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు వెల్కం బోర్డులు, నో పార్కింగ్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు పెట్టడానికి తీర్మానించారు. పలు అభివృద్ధి పనులను కౌన్సిల్లో ప్రస్తావించి, పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్ఞానజ్యోతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మోహన్, మున్సిపల్, ఎలక్ట్రికల్, పంచాయతీరాజ్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.