తెలంగాణ సిద్ధాంతకర్త దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలు స్మరించుకున్నారు. ఆయన జయంతి సందర్భంగా శనివారం ఊరూరా చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనకు పరితపించి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. తెలంగాణకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాల పట్ల సామాన్య ప్రజానీకానికి సైతం అవగాహన కల్పించి, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన జన హృదయ నేత. ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. శనివారం ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను ప్రజాప్రతినిధులు, అధికారులు కొనియాడారు.
ఆయన సంకల్పాన్ని, నిరంతర కృషిని తెలంగాణ ఎప్పటికీ మరిచిపోదన్నారు. ఉద్యమకారుడి నుంచి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన జయశంకర్ సేవలను ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనులను భాగస్వామ్యం చేయడానికి, తెలంగాణ భావజాల వ్యాప్తికి, ప్రజా ఆందోళనలు, రాజకీయ ప్రక్రియలకు జయశంకర్ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.