మెదక్, ఏప్రిల్ 24(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం మెదక్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు మాతాశిశు దవాఖాన ఏర్పాటు చేసింది. వంద పడకల దవాఖాన భవనం నిర్మాణం చేసి రోగులకు కార్పొరేట్ వైద్యం అందించింది. గర్భిణులకు రక్త, మూత్ర పరీక్షలు, అల్ట్ట్రాసౌండ్ స్కాన్, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ పరీక్షలు చేయాలి. టీబీ టీకాలు, ఐరన్, ఫోలిక్యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. హై రిస్క్ గర్భధారణ చికిత్స చేయాలి. మహిళలకు మెరుగైన ప్రసవాలు, 24 గంటలు సిజేరియన్ ఆపరేషన్లు చేయాలి. లేబర్ రూమ్ సౌకర్యం ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చికిత్స చేయాలి.
శిశువు పుట్టిన వెంటనే బేబీ చెకప్ చేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు సకాలంలో దవాఖానకు రావడం లేదని రోగులు వాపోతున్నారు. వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించారు. వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించారు. ప్రస్తుతం జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక రోగులకు మెరుగైన వైద్యం అందడం లేదు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. గర్భిణులు, శిశువులకు వైద్యం అందడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి
ప్రధాన రోడ్డు నుంచి మాతాశిశు దవాఖానకు వెళ్లే రోడ్డు పై విద్యుత్ దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో దవాఖానకు వెళ్లే రోగులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు నెలలుగా విద్యుత్ దీపాలు వెలుగడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. దవాఖాన మెదక్ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో రాత్రి సమయంలో చేగుంట రోడ్డు నుంచి రోగులు దవాఖానకు వెళ్తారు. విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.