జహీరాబాద్, ఫిబ్రవరి 28: దేశం పదికాలాల పాటు శాంతిభద్రతలతో బాగుండాలంటే బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలని, మోదీ నాయకత్వం దేశానికి అవసరమని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం జహీరాబాద్లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే రియల్టర్లు, కంపెనీ యజమానులను బెదిరించి దోపిడీ చేస్తున్నదన్నారు. తెలంగాణలో దోపిడీ చేసిన డబ్బులు దేశంలోని పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి కోసం మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో 40 సీట్లు ఉన్నాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 40 సీట్లు రావన్నారు. కర్ణాటకలో ఉన్న అన్ని ఎంపీ సీట్లు బీజేపీ గెలుపొందడం ఖాయమన్నారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లు బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్ కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలన్నారు. హైదరాబాద్లో ఎంఐఎం ఎంపీ ఈసారి ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. దేశ రక్షణ కోసం మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, ఏ గ్రామానికి వెళ్లినా మోదీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రాంరెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ నాయకులు జైపాల్రెడ్డి, పైడి ఎల్లారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. అధికారుల సమాచారం మేరకు ప్రధాని మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. 4న ఆదిలాబాద్ జిల్లాలో, 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక ఏర్పాట్లు చేపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ పర్యటనపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి చేకూర్చే రీతిలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను బీజేపీ చేపడుతున్నది. 5న ప్రధాని మోదీ ఉదయం 10గంటలకు బేగంపేట ఎయిర్పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సంగారెడ్డికి చేరుకుంటారు. సంగారెడ్డిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. నాందేడ్-అకోలా రహదారి విస్తరణ పనులు పూర్తికావడంతో 5న ప్రధాని సంగారెడ్డిలో ప్రారంభిస్తారు. 65వ నెంబరు జాతీయ రహదారిని గంగారం నుంచి సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వరకు ఆరులేన్ల పనులకు మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
వీటితో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిసింది. అనంతరం సంగారెడ్డిలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సభను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి సభకు జనసమీకరణ జరిగేలా బీజేపీ దృష్టిపెట్టింది. బహిరంగ సభ నిర్వహించేందుకు అనువైన స్థలాలను బీజేపీ నేతలు బుధవారం సంగారెడ్డిలో పరిశీలించారు. బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు రుద్రమదేవి, సంగప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరిఅంజిరెడ్డి సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్తో పాటు సంగారెడ్డి శివారులోని రెండు బహిరంగ ప్రదేశాలను మోదీ సభ నిర్వహణ కోసం పరిశీలించారు. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సంగారెడ్డికి వచ్చి మోదీ బహిరంగ సభ స్థలాన్ని ఖరారు చేయడంతో పాటు జనసమీకరణ ఇతర ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు తెలిసింది.