పటాన్చెరు రూరల్/అమీన్పూర్(జిన్నారం), మార్చి 17: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు హోటల్ పరిశ్రమకు నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కళకళలాడిన హోటళ్లు, బేకరీలు, స్వీట్హౌస్లు, క్యాంటీన్లు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు లభించక మూతపడే దశకు చేరాయి. వంట గ్యాస్ లభించక సంగారెడ్డి జిల్లా ముత్తంగిలోని ప్రముఖ స్వీటీపాయి స్వీట్హౌస్ మూతపడింది. దాంట్లో పనిచేస్తున్న ముప్పై మంది సిబ్బంది ఉపాధి ప్రశ్నార్థకమైంది. చిన్నపాటి టీ హోటళ్లు వరుసగా మూత పడుతున్నాయి. నిత్యం కిటకిటలాడే హోటళ్లకు కమర్షియల్ గ్యాస్సిలిండర్లు లభించక ఇదే పరిస్థితి నెలకొంది. తొలుత బ్లాక్లో కొనినడిపించినా, ఆ తర్వాత ఆ పద్ధ్దతిలోనే లభ్యం కావడం లేదు. దీంతో హోటళ్లు మూసివేసేందుకు మనసొప్పక కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు.
దాదాపు ముప్పై, నలభై ఏండ్ల క్రితం వరకు కట్టెల పొయ్యిపై వంటలు చేసేవారు. ఆ తర్వాత గ్యాస్ అందుబాటులోకి రావడంతో వంట మాస్టర్లు గ్యాస్తో వండటం ప్రారంభించారు. ఇప్పుడు ఉన్న వంట మాస్టర్లకు కట్టెల పొయ్యిపై వంటలు కష్టతరమైన ప్రక్రియ.. అయినా ఉపాధికోసం కట్టెలపొయ్యిపైనే వంటలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలోని ముత్తంగి జంక్షన్ హోటళ్లకు ప్రసిద్ధి. ప్రముఖ హోటళ్లు ఇక్కడే ఉన్నాయి. దాదాపు 1000 మంది వరకు హోటల్ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వారం రోజులుగా వంట గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
దీంతో హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కమర్షియల్ వంట గ్యాస్ రూ. 2వేలకు లభించేది. నిన్నటి దాకా యుద్ధ ప్రభావం అంటూ బ్లాక్లో రూ. 5వేలకు లభించినట్లు పలు క్యాంటీన్ల నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు బ్లాక్లో కూడా కమర్షియల్ సిలిండర్లు లభించడం లేదని వాపోతున్నారు. కస్టమర్లపై ప్రభావం పడకుండా హోటళ్ల యజమానులు కట్టెల పొయ్యిలను ఆశ్రయించారు. యుద్ధ ప్రాతిపదికన క్వింటాళ్ల కట్టెలు తెచ్చి వంటలు చేయిస్తున్నారు. వారం క్రితం కేజీ రూ. 8 లభించిన కట్టెలు ఇప్పుడు రూ.15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ పెరగడంతో కట్టెల వ్యాపారులు ధరలు డబుల్ చేశారు. అయినా హోటళ్ల నిర్వాహకులు కట్టెలు కొనుగోలు చేసి వంటలు చేయిస్తున్నారు.

మూతపడిన స్వీటీపాయి స్వీట్ హౌస్
గ్యాస్ లభించక సంగారెడ్డి జిల్లా ముత్తంగి జంక్షన్లోని స్వీటీపాయి స్వీట్హౌజ్ మూతపడింది. దాదాపు ముప్పైమంది సిబ్బంది పనిలేక ఇండ్లకే పరిమితమయ్యారు. స్వీట్హౌస్ భట్టీలు గ్యాస్ ఆధారితంగా తయారై ఉండగా కట్టెల పొయ్యిలు వాడే పరిస్థితి లేదు. అందులో ఇప్పటి స్వీట్ తయారీ మాస్టర్లకు కట్టెల పొయ్యిపై వంటలు చేయడం రాదు. ప్రముఖ స్వీట్హార్ట్ రెస్టారెంట్లో రోజుకు 15 నుంచి 20 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాడేవారు. ఇప్పుడు ఒక్క గ్యాస్సిలిండర్ లభించక గ్యాస్ ఆధారిత ఉత్పత్తులు నిలిపివేశారు. ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు ప్రారంభించి వంటలు చేయిస్తున్నారు. కట్టెల ధరలు రెట్టింపు కావడంతో ఆ ప్రభావం హోటల్ ఐటమ్స్పై పడుతుందని యజమానులు వాపోతున్నారు.
మూతపడుతున్న రెస్టారెంట్లు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సర్కిల్ పరిధిలో వందలాది హోటళ్లు ఉన్నాయి. ప్రస్తుతం సరిపడా గ్యాస్ సరఫరా లేక హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుటి వరకు వెయ్యి వరకు మూతపడ్డాయి. మరికొంతమంది యజమానులు కట్టెల పొయ్యిని ఉపయోగిస్తూ హోటళ్లు నడుపుతున్నారు. రోడ్డు పక్కన ఉన్న చిరు హోటళ్లలో కేవలం ఇడ్లీని మాత్రమే విక్రయిస్తున్నారు.
కష్టాలు చవిచూస్తున్నాం
వంట గ్యాస్ లభించక కష్టాలు చవిచూస్తున్నాం. మా వద్ద గ్యాస్పై తప్పా కట్టెల పొయ్యిపై వంటలు రాని మాస్టర్లతో సమస్యగా మారింది. వస్తున్న ఆర్డర్లను తక్షణం ఇవ్వడం గ్యాస్తోనే సాధ్యమయ్యేది. ఇప్పు డు కట్టెలపొయ్యిపై వంటలు చేయడం లేటవుతుంది. కస్ట్టమర్లు త్వరగా కావాలంటారు. రేపటి నుంచి చైనీస్ సెక్షన్ నిలిపివేస్తాం. కట్టెల ధరలు కూడా పెంచేశారు. మాకు రోజుకు 10 క్వింటాళ్ల కట్టెలు కావాలి. మేం నష్టాలు భరించి ఇంతవరకు ధరలు పెంచలేదు. ఇక మీదట పరిస్థితి ఇలాగే ఉంటే ధర లు పెంచాల్సి ఉంటుంది. లేదంటే హోటల్ మూసివేసుకోవాల్సి వస్తుంది. వర్కర్లు రోడ్డుపై పడతారని ఆగుతున్నాం. నెల తిరగ్గానే జీతాలు, హోటల్ కిరాయి, ఇతర ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం హోటళ్లకు వంట గ్యాస్ సరఫరా చేయాలని కోరుతున్నాం. – అశ్వక్ హుస్సేన్, స్వీట్ హార్ట్ యజమాని, ముత్తంగి (సంగారెడ్డి జిల్లా)
గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి
అమీన్పూర్ (జిన్నారం), మార్చి 17 : గ్యాస్ సరిపడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కట్టెల పొయ్యి మీద బిర్యానీ వండుతున్నాం. బిర్యానీ మాస్టర్ వెళ్లిపోతే మేము మరింత ఇబ్బంది పడాల్సి వస్తది. మరిన్ని రోజులు గ్యాస్ కష్టాలు ఉంటే హోటల్ నడపడం కష్టం. ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ కొరత లేకుండా
చూడాలి.
– రాజు, హోటల్ వ్యాపారి, అమీన్పూర్, (సంగారెడ్డి జిల్లా)