తొగుట, మార్చి 10: మండలంలోని పెద్దమాసాన్పల్లిలోని హెటిరో డ్రగ్స్ కంపెనీకి చెందిన భూముల్లో మావోయిస్టు పార్టీ పేరు మీద వెలిసిన వాల్ రైటింగ్స్, బ్యానర్ కలకలం రేపింది. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం 2007 నుంచి పెద్దమాసాన్పల్లి, కొండపాక మండలం సిర్సినగండ్ల గ్రామాల పరిధిలో 360 ఎకరాల భూమిని సేకరించారు. 2015లో ప్రజాభిప్రాయ సేకరణ చేయగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. రసాయన కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల ఈప్రాంతం విషతుల్యం అవుతుందని గ్రామస్తులు ఆందోళన నిర్వహించి సభను అడ్డుకున్నారు. అప్పట్లో 22 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో కొద్ది రోజులుగా భూమి చుట్టూ కంపెనీ వారు ప్రహరీ నిర్మిస్తున్నారు. దీంతో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తారని పుకార్లు వినిపించాయి. కంపెనీ భూముల మధ్య ప్రభుత్వ భూములు ఉన్నాయని, కాపాడాలని గ్రామానికి చెందిన యువకులు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం మావోయిస్టు పార్టీ పేరుమీద బ్యానర్, వాల్ రైటింగ్స్ కనిపించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చెందిన పన్యాల ఎల్లారెడ్డి పశువుల కొట్టం వద్ద బ్యానర్, హెటిరో కంపెనీ వాచ్మెన్ గదులకు వాల్ రైటింగ్స్ రాశారు. అక్రమంగా పేదల నుంచి తీసుకున్న భూములను తిరిగి వారికి అప్పగించాలని, అక్రమంగా పేద ల భూములు తీసుకొని కంపెనీకి కట్టపెట్టాలని ప్రయత్నిస్తే బడా పెట్టుబడిదారులకు ప్రజాకోర్టులో శిక్షతప్పదని హెచ్చరికలు చేశారు.
హెటిరో కంపెనీ భూముల పరిధిలో మావోయిస్టుల పేరుమీద వాల్ రైటింగ్స్ వెలువడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. చాలా ఏండ్లుగా మావోయిస్టుల ఉనికి కనిపించలేదు. గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన మావోయిస్టులు, సానుభూతిపరులు ఇలాంటి కార్యక్రమం చేపట్టారా, లేక కంపెనీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్లు చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. గతంలో ఓదన్ చెర్వు వద్ద జెండాలు వెలిసిన సందర్భంగా మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఎస్సై రాజేశ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై తొగుట సీఐ లతీఫ్ను వివరణ కోరగా సంఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు.