గుంటూరు నుంచి మెదక్ జిల్లా రామాయంపేటకు..
పంటలను కాపాడేందుకు వినియోగం
ఒక్కో టార్పాలిన్కు రూ.20 అద్దె
వానకాలంలో ఎనిమిది, యాసంగిలో నెల రోజులు ఉపాధి
రామాయంపేట, మే18: పనులు కరువైన తమకు తెలంగాణ రాష్ట్రం అమ్మలా ఆదుకుంటున్నది. కడుపునిండా తిండి, చేతినిండా పనిదొరుకుతున్నదని వలసజీవులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి రాష్ర్టాల్లో కూలీ కూడా దొరకకపోవడంతో తెలంగాణకు వలసొచ్చి కాలం వెళ్లదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని వివిధ గ్రామాల నుంచి టార్పాలిన్లు అద్దెకిచ్చుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్నారు. పదిహేనేండ్లుగా యాసంగి, వానకాలం సీజన్లలో మెదక్ జిల్లా రామాయంపేట, నిజాంపేట మండల కేంద్రాల్లోని రోడ్లపై ఉన్న ఖాళీ స్థలాల్లో గుడారం వేసుకుని నివసిస్తున్నారు. వారివెంట తెచ్చుకున్న టార్పాలిన్లను అద్దెకిస్తూ బతుకీడుస్తున్నారు.
15 ఏండ్లుగా సుపరిచితులు
ఒక్కో కుటుంబం 500లకు పైగా టార్పాలిన్లు తీసుకొచ్చకుని అద్దెకిస్తుంటారు. యాసంగిలో మూడు కుటుంబాలు ఈ రెండు మండలాలకు వచ్చారు. వీరు 15 ఏండ్లుగా ఈ ప్రాంతవాసులకు సుపరిచితులు. ఒక్కో టార్పాలిన్కు రోజుకు రూ.20 చొప్పున అద్దెకిస్తున్నారు. యాసంగి, వాన్షకాలాల్లో రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు ఈ టార్పాలిన్లను ఉపయోగిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తమ వడ్లను, పంట ఉత్పత్తులను వర్షాలకు కాపాడుకోవడానికి ఒక్కో రైతు వారం రోజుల పాటు టాపర్లను అద్దెకు తీసుకుంటారు. వరి, మొక్కజొన్న ధాన్యాన్ని ఆరబోసుకుంటారు. వరిని టాపర్లలో ఆరబోస్తే 4, 5 రోజుల్లో ధాన్యం ఎండి తూకాలు పెడతారు. ఒకవేల వర్షం పడితే టాపర్లకు ఉన్న గిరాకీ మరేదానికి ఉండదు. అందు కోసం రైతులు అటు ధాన్యం చేతికి రావడంతో టాపర్లను అద్దెకు తీసుకుంటారు.
టార్పాలిన్లతోనే ఉపాధి
టాపర్లు అద్దెకివ్వడం కోసం గుంటూరు నుంచి మెదక్ జిల్లాలోని రామాయంపేట, నిజాంపేట మండలాలకు వలసవచ్చాం. ఒక్కో టాపర్ను రూ.20కి అద్దెకిస్తాం. రెండు సీజన్లలో 15 రోజుల పాటు అక్కడే ఉండి వ్యాపారం చేసుకుంటాం. మాకు తెలంగాణ రాష్ట్రమే అన్నం పెడుతున్నది. మా జీవితంలో తెలంగాణ రాష్ర్టాన్ని, ఇక్కడి ప్రజల ఆదరణను మరచిపోం.
– లక్ష్మీ, శ్రీనివాస్, గుంటూరు