ప్రార్థనలు, ప్రత్యేక ఆలింగనాలు, ఆత్మీయత వెల్లివిరియగా.. జిల్లాలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్లోని కేథడ్రల్ చర్చికి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్లు దైవసందేశం వినిపించారు. మెదక్ చర్చిలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర గిరిజన అభివృద్ధి, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి పాల్గొన్నారు. వేడుకలు ప్రశాంతం జరిగేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. – మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25: మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 4.30గంటలకు శిలువ ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. శనివారం అర్ధరాత్రి నుంచే భక్తులు చర్చికి తరలివచ్చారు. రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. మొదటి ఆరాధనకు మెదక్ డయాసిస్ అధ్యక్ష మండల బిషప్ రెవరెండ్ రైట్ ఏసీ సాలోమాన్రాజ్ పాల్గొని భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేశారు.
మానవాళికి రక్షకుడు యేసు
– బిషప్ రెవరెండ్ సాలోమాన్రాజ్
మానవాళికి రక్షకుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు యేసుప్రభువు అని మెదక్ బిషప్ రెవరెండ్ ఏసీ సాలోమాన్రాజ్ అన్నారు. చర్చిలో ఉదయం 4.30 గంటలకు నిర్వహించిన తొలి ఆరాధన ప్రార్థనల్లో ఆయన పాల్గ్గొని దైవ సందేశం వినిపించారు. యేసు రక్షకుడిగా పుట్టాడని, ప్రభువుకు మరణం లేదన్నారు. సమసమాజ నిర్మాణానికి ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి దేవుని వెలుగు ద్వారా సంతోషం కలగాలని, ప్రభువు నుంచి పొందిన ప్రేమను లోకానికి పంచాలని ఆయన పిలుపునిచ్చారు.లోకంలోని ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలన్నదే ప్రభువు అభిమతమని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి శాంతి, ప్రేమతత్వాన్ని అలవర్చుకుని నడుచుకోవాలన్నారు. ప్రేమ, శాంతి, ఐక్యతే క్రిస్మస్ సందేశమని ఆయన పేర్కొన్నారు.
లోక రక్షకుడు యేసయ్య
– చర్చి ప్రెసిబెటరీ రెవరెండ్ అండ్రూస్ ప్రేమ్సుకుమార్
విశ్వానికి మార్గం చూపే రక్షకుడు యేసయ్య అని, దేవుడే మానవుడిగా ఏసుక్రీస్తు రూపంలో ఈ లోకానికి వచ్చాడని మెదక్ చర్చి ప్రెసిబెటరీ ఇన్చార్జి రెవరెండ్ జార్జి ఎభినేజర్ రాజు అన్నారు. ఉదయం 10గంటలకు రెండో ఆరాధన ప్రార్థన అనంతరం భక్తులనుద్దేశించి ఆయన దైవసందేశం వినిపించారు. ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించే వారికి విశ్వాసంగా ఉంటారన్నారు. ఈ ప్రార్థనల్లో బిషపమ్మ వజ్ర సంతోషిణి, బిషప్ కుటుంబ సభ్యులు, పాస్టర్లు డేవిడ్, శ్రీనివాస్, సువర్ణ, మెదక్ చర్చి కమిటీ సభ్యులు రోలండ్పాల్, సంశాన్ సందీప్, వికాస్, సునీల్, సువన్డగ్లస్, అనూప్, జయరాజ్, వసతి గృహాల మేనేజర్ జాయ్ముర్రే, భక్తులు పాల్గొన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
– మంత్రి సత్యవతి రాథోడ్
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జాతీయస్థాయిలో విస్తరించిన బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు యేసయ్య దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రోథోడ్ అన్నారు. మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్తో కలిసి ఆమె పాల్గ్గొన్నారు. ఈ సందర్భంగా చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి జార్జి ఎబినేజర్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆమెను ఆశీర్వదించారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను శాలువాలతో చర్చి కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని యేసుప్రభువు కోరుకున్నారన్నారు. రాష్టంలో సర్వమతాలను సమానంగా ఆదరిస్తూ, అందరి సంక్షేమానికి కృషిచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.
యేసు చూపిన బాటలో నడుచుకోవాలి
– మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
యేసుప్రభువు చూపిన బాటలో అందరూ నడుచుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేథడ్రల్ చర్చి మెదక్లో ఉండడం గర్వకారణం అన్నారు. శత్రువులను సైతం ప్రేమతో క్షమించాలని సూచించిన ప్రేమమూర్తి యేసు ప్రభువు అన్నారు. ప్రేమ, దయ కరుణ, జాలి గుణాలతో జీవించాలని ప్రభువు సూచించిన మార్గంలో పయనిద్దామని ఆమె పిలుపునిచ్చారు. మెదక్ చర్చి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు జయరాజు, వసంత్రాజ్, సమీయొద్ద్దీన్, శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు ఫ్లారిన్ సంశాన్, ఉమర్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు గంగాధర్, కృష్ణాగౌడ్, నాయకులు శివరామకృష్ణ, అరవింద్గౌడ్, శంకర్, ప్రవీణ్గౌడ్, కొండ శ్రీనివాస్, జాయ్ముర్రే, మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి ఉన్నారు.
పటిష్ట భద్రత మధ్య క్రిస్మస్ వేడుకలు
– మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ అర్బన్, డిసెంబర్ 25: జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రశాంతంగా నిర్వహించినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్లోని చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్దదని, ప్రార్థనలు చేసేందుకు భక్తులు భారీగా వచ్చారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణలో పటిష్ట మైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పిక్ పాకేటింగ్, స్నాచింగ్ లాంటివి జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూమ్నూ ఏర్పాటు చేశామని తెలిపారు.
భారీ ఏర్పాట్లు… పోలీసుల నిఘా
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా మెదక్ సీఎస్ఐ కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. మెదక్ బస్సు డిపో ఎదురుగా గల మెయిన్ గేట్ నుంచి మొదలుకొని చర్చి ముఖద్వారం వరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. చర్చి ప్రధాన ద్వారం వద్ద పోలీసులు మెటల్ డిటెక్టర్లు, పోలీస్ డాగ్లతో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి భక్తుల తాకిడి పెరిగిపోవడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది.
మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు శ్రమించారు. కాగా, రాత్రి విద్యుత్ కాంతులతో మెదక్ చర్చి ప్రాంతం శోభాయమానంగా వెలుగొందింది.