సంగారెడ్డి కలెక్టరేట్, మే 16: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడేళ్ల ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లొమా ప్రవేశాల కోసం ఈ నెల 17న నిర్వహించనున్న పాలిసెట్ -2023కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలు, జోగిపేట్లో ఒక కేంద్రంతో జిల్లాలో మొత్తం ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏడుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లతో పాటు ఇన్విజిలేటర్లు తదితర సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం 2,760 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. 11 గంటలు దాటితే ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
ఏడు కేంద్రాల్లో నిర్వహణ
సంగారెడ్డిలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశా రు. అందులో సెయింట్ అంథోనీస్ స్కూల్లో 430 విద్యార్థులు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 240 మంది విద్యార్థులు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 520 మంది, ఎస్వీ జూనియర్ కళాశాలలో 600 మంది, కరుణ హైస్కూల్లో 480 మంది, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 240 మంది హాజరుకానున్నారు. అలాగే జోగిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో మొత్తం 250 విద్యార్థులు హాజరుకానున్నారు.
మెదక్లో ఏర్పాట్లు పూర్తి
మెదక్ మున్సిపాలిటీ, మే 16: పాలిసెట్కు మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్ సువర్ణలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు ఆరుగురు అబ్జర్వర్లు, నలుగురు ప్రత్యేక అబ్జర్వలతోపాటు ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పాలీసెట్ పరీక్షకు సంబంధించి 1933 మంది విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందు నుంచే అనుమతిస్తారని తెలిపారు.