రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, అదే రోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు వేయడానికి నవంబర్ 10 చివరి గడువుగా నిర్ణయించారు. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కలెక్టర్లు, ఎస్పీలు సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి తెలియజేశారు. పక్కాగా కోడ్ అమలు చేసేందుకు యంత్రాంగం నిమగ్నమైంది. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, కటౌట్లు తొలిగిస్తున్నారు. జాతీయ నేతల విగ్రహాలకు ముసుగులు తొడుగుతున్నారు. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్లు, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 11 శాసనసభా స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే గులాబీ అధినేత బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా..వారంతా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారానికి కేవలం 52 రోజులు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు బిజీబిజీగా ఉన్నారు.
– సిద్దిపేట, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేశారు. నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి శాసనసభ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్లు వేయడానికి చివరి గడువు నవంబర్ 10. నామినేషన్ల స్క్రూటినీ నవంబర్ 13, నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15, నవంబర్ 30న ఎన్నికలు నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఒకే దశలోనే పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ను విడుదల కావడంతో జిల్లా వ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ పోలీస్ పికెటింగ్లు, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలోఎన్నారైలు, సర్వీసు ఓటర్లు కలుపుకొని మొత్తం 9,25,868 మంది ఉన్నారు. ఈ జిల్లాలో మొత్తం 1151 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో అన్ని కలుపుకొని మొత్తం 4,34,408 మంది ఓటర్లు ఉండగా పోలింగ్ కేంద్రాలు 579 ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎన్నారై, సర్వీసు ఓటుర్లు కలుపుకొని మొత్తం 13,56,386 మంది ఉండగా 1594 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో (హుస్నాబాద్ కలుపుకొని) మొత్తం 11 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఆందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వు స్థానాలు కాగా మిగతా తొమ్మిది స్థానాలు జనరల్ స్థానాలు ఉన్నాయి. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మిగిలిన ఎనిమిది స్థానాలు జనరల్ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తన అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. వారంతా ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఎన్నికల ప్రచారానికి కేవలం 52 రోజులు మాత్రమే సమయం ఉంది.