జహీరాబాద్, మే 9: కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ బుధవారం (నేడు) జరగనున్నది. పోలింగ్కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సంగారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉండే బీదర్ జిల్లాలో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ జిల్లాలో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన వారు పదిశాతం మంది ఓటర్లు ఉన్నారు. వీరు గెలుపోటములు శాసించనున్నారు. ఈ ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారం చేశారు.
కన్నడ ఓటర్లు ఎవరిపై కరుణ చూపిస్తారో..
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. అన్ని పార్టీలు సభలు, రోడ్డుషోలు, భారీ ర్యాలీలతో నెలన్నరకు పైగా రోజులుగా ముమ్మర ప్రచారం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, పోటాపోటీ ప్రసంగాలు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు అమలు చేశాయి. అనేక హామీల జల్లులతో పార్టీల ప్రచారం జోరుగా సాగిం ది. ప్రధానంగా అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ కన్నడ ఓటర్ల్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేశారు. డబ్బులు, మద్యం రవాణా కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
బీదర్ జిల్లాలో..
సంగారెడ్డి సరిహద్దులోని బీదర్ జిల్లాలో బసవకల్యాణ, ఔరాద్, బాల్కి, హుమ్నాబాద్, బీదర్, బీదర్(దక్షిణ) నియోజకవర్గాలు ఉన్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రంలో వరుసలో ఉన్న వారికి టోకెన్లు అందజేసి, రాత్రి 9 గంటలైనా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని వారు తెలిపారు. పింక్, సఖీ, దివ్యాంగుల, యువ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ జరిగే కేంద్రంలో ఓటింగ్ యంత్రాలకు సాంకేతిక లోపా లు వస్తే తక్షణమే మరమ్మతులు చేయడం, లేకుంటే మార్పు చేయడానికి 20 నుంచి 30 శాతం అదనంగా యంత్రాలను ఉంచినట్లు అధికారులు తెలిపారు. బీదర్ జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో 1495 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బీదర్ జిల్లాలో 13,01,546 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కలబుర్గా జిల్లాలోని చించొళి నియోజకవర్గంలో పురుషులు 97,243, మహిళలు 93,718, ఇతరులు 15, మొత్తం 190,976 ఓటర్లు ఉన్నారు.