సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 13: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై శనివారం పోలీసులు 24 టీమ్లుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న 38 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రూ. 1,21,27,120 నగదు, 490 డాక్యుమెంట్లు, 13 కేజీల వెండి, 70 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించి, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీలకు డబ్బులు ఇచ్చి వారి నుంచి అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్ధతుల్లో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలన్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయినా, అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం నడిపేవారి వివరాలు సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్: 8712667100 నెంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదని, కానీ ఆర్బీఐ నిబంధనలు, తెలంగాణ మనీ లెండింగ్ చట్టంలోని నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా ఎవరైనా లైసెన్స్తో అప్పులు ఇవ్వవచ్చని, తీసుకోవచ్చని సీపీ అనురాధ తెలిపారు.