అక్కన్నపేట, డిసెంబర్ 11: ఆటోలు, మినీ టాటా ఏసీ వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని హుస్నాబాద్ సీఐ కిరణ్ సూచించారు. హుస్నాబాద్ నుంచి ఆదివా రం ఆటోలో 16 మంది ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తుండగా, మండలంలోని గూడాటిపల్లి వద్ద సీఐ ఆటోను గుర్తించి ఆపారు. అనంతరం డ్రైవర్కు కౌన్సెలింగ్ చేశారు.
పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులను తీసుకువెళ్తే ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. తాగి ఆటోలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీవో నిబంధనల ప్రకారం ఆటోలు నడుపుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు వాహనాలకు సంబంధించిన అన్ని అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్, రోడ్డు నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడుపాలని కౌన్సెలింగ్ చేశారు.