మనోహరాబాద్, ఏప్రిల్ 18 : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని పాలిమార్ స్టీల్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమను పోలాండ్ దేశ రాయబార బృందం గురువారం సందర్శించింది. పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావుతో కలిసి పోలాండ్ రాయబారి చార్జ్ డీ ఎఫైర్స్ డాక్టర్ సెబాస్టియన్ డోమ్ జెలస్కీ, కాన్సుల్ జనరల్ డాక్టర్ అలెక్యాసండర్ దండా, పోలాండ్ కార్యాలయ ఆర్థిక వ్యవహారాల కౌన్సిలర్ కాన్సుల్ పావెల్ మోక్జ్రైకీ ప్లాంట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలిమార్ స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీఆర్ సుబ్బారావు మాట్లాడుతూ… ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలోని పాలిమార్ స్టీల్ పరిశ్రమలో దేశంతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు కీలకమైన విడి భాగాలను తయారుచేసి ఎగుమతులు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, టీఎస్ఐఐఐసీల మద్దతుతో ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థను విస్తరించేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. యూరోపియన్ రైళ్ల ఉత్పత్తి కంపెనీలకు సైతం ఇక్కడి నుంచే ఎగుమతి జరుగుతోందన్నారు. మరో మూడు ఎకరాలను విస్తరించి రూ. 2.50 మిలియన్ యూరోల పెట్టుబడి పెట్టి, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తయారు చేస్తున్న ఉత్పత్తులను పోలాండ్ బృందం పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేసింది. అంతకుముందు పరిశ్రమ ఆవరణలో పోలాండ్ రాయబార బృందం మొక్కలు నాటారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.