సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు గ్రామ శివారులో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. ఈ దాడిలో నగదు రూ.5670, ఏడు మోటార్ సైకిళ్లు, ఐదు మోబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, దాడి సమయంలో అక్కడి నుంచి మరో ఐదుగురు పారిపోయారు. పోలీసులు నిత్యం దాడులు చేస్తున్నా పేకాటరాయుళ్లలో మార్పు రావడం లేదు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా పేకాటకు బానిసలవుతూ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
సిద్దిపేట రూరల్, డిసెంబర్ 11 : జిల్లాలోని రహస్య ప్రాంతాలే అడ్డాగా పేకాట జోరుగా సాగుతోంది. శివారు ప్రాంతాలు, దట్టమైన మారుమూల అటవీప్రాంతంలోని ప్రదేశాలను ఎంచుకుంటున్న పేకాటరాయుళ్లు ఎప్పటికప్పుడు టాస్క్ఫోర్స్కు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. అయితే జిల్లాలో ఎక్కడెక్కడ పేకాటస్థావరాలు ఉన్నాయనే దానిపై ఇప్పటికే టాస్క్ఫోర్స్ నిఘా పెట్టింది. పేకాటకు బానిసగా మారిన వారు అందినకాడ అప్పులు చేస్తూ కుటుంబాలను వీధినపడే పరిస్థితికి దిగజార్చుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా పేకాట గ్యాంగ్ శివారుప్రాంతాల్లో ఆడిస్తున్నట్లు సమాచారం.
గతనెలలో పుల్లూరు గ్రామ శివారులోని రహస్య ప్రాంతంలో పేక ఆడుతున్నారనే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ దాడి చేసి పలువురిని పట్టుకుంది. అయితే టాస్క్ఫోర్స్ దాడిని ముందుగానే పసిగట్టిన కొందరు పేకాటరాయుళ్లు అక్కడి నుంచి తప్పించుకుపోగా, మరికొందరు పోలీసులకు చిక్కారు. ఇప్పటివరకు పేకాట స్థావరాలపై దాడి చేసిన టాస్క్ఫోర్స్ 15కేసులు నమోదు చేసింది. 140 మంది నిందితులను పట్టుకొని రూ.1,71,614 నగదును సీజ్ చేసింది. కాగా, మూడేండ్లుగా పలు ప్రాంతాలపై దాడులు చేస్తున్న టాస్క్ఫోర్స్ పేకాటను అరికట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 2020లో 74 కేసులు నమోదు చేసిన పోలీసులు 497 మంది నిందితులను పట్టుకొని రూ.7,93,623 నగదును సీజ్ చేసింది. 2021లో 39 కేసులు నమోదు కాగా, 283 మందిని అరెస్టు చేసి రూ.22,37,566 నగదును సీజ్ చేసింది.
కఠిన చర్యలు తప్పవు
ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పేకాట స్థావరాలపై నిఘా పెంచాం. కేసులు నమోదు చేస్తు న్నాం. ఇలాంటి వాటిపై కఠిన చర్య లు తప్పవు. పేకాటకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చదువుపై దృష్టిపెట్టాలి. కుటుంబ పోషణపై దృష్టిపెట్టాలి. పేకాటతో కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటాయి.
– జానకీరాంరెడ్డి, సీఐ, సిద్దిపేట రూరల్