అక్కన్నపేట, మే 23: గ్రామ పంచాయతీల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని కోరుతూ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు గురువారం ఎంపీడీవో భానోతు జయరామ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ… నాలుగైదు నెలల నుంచి గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదల కాకపోవడంతో తమపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొసాగుతోందన్నారు. గతంలో అభివృద్ధి పనులను గ్రామ సర్పంచ్లు చేసేవారని, ఇప్పుడు అలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంపీడీవో హామీఇచ్చారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఈ భారం మోయలేము’ అనే వార్త కథనం అంతటా చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం అద్దం పడుతుందని పలువురు కార్యదర్శులు పేర్కొన్నారు.