గజ్వేల్, ఫిబ్రవరి 13: ఒకప్పుడు పొలం గట్లు, కుటుంబాల తగవుల పంచాయితీలకే పరిమితమైన గజ్వేల్ పాండవుల చెరువు, ఇప్పుడు మినీట్యాంక్బండ్గా మారి అందరికీ ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచుతున్నది. రూ.1.81 కోట్లతో చెరువు అభివృద్ధిలో భాగంగా చెరువుకట్ట విస్తరణ, సీసీ పనులు చేపట్టారు. రూ.4.50కోట్లతో టూరిజం శాఖ ఆధ్వర్యంలో చెరువుపై అందమైన మొక్కలు, చెట్లు నాటించారు. వివిధ రకాల బొమ్మలు, కళాకృతులు, బుద్ధవిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలకు యోగా,వ్యాయామం చేయడానికి ప్రత్యేకమైన షెడ్లు, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేశారు. వాకింగ్ చేయడానికి అవసరమైన ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకోవడానికి కిండర్ గార్డెన్ ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలంతా కుటుంబాలతో సహా పాండవుల చెరువుకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు. పలు కుల సంఘాలు గజ్వేల్ పాండవుల చెరువుపై వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి.
సుందరీకరణకు మరో 2.40కోట్లు..
పాండవుల చెరువు సుందరీకరణకు మరో 2.40 కోట్లు గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గడా)నిధులు మంజూరయ్యారు. వీటికి సంబంధించి త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఇప్పటికే గజ్వేల్ పాండవుల చెరువు మినీట్యాంక్బండ్, సుందరీకరణకు రూ.6.31కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారు. సీఎం కేసీఆర్ పాండవుల చెరువును మరింత సుందరీకరించడానికి రూ.2.40 కోట్ల గడా నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో పలు మరమ్మతులతో పాటు చెరువు మధ్యలో శివుని విగ్రహం, పాండవుల విగ్రహాలు, అధునాతన రీతిలో లైటింగ్, ఫౌంటెయిన్లు అభివృద్ధి చేయనున్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే..
గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో గజ్వేల్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయింది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో గజ్వేల్ దశ, దిశ పూర్తిగా మారిపోయింది. అద్భుతమైన ప్రభుత్వ భవనాలు, విశాలమైన రహదారులు ఏర్పాటయ్యాయి. పాండవుల చెరువును సీఎం కేసీఆర్ కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడంతో ప్రజలంతా సాయంకాలం చెరువు మినీ ట్యాంక్బండ్పై గడపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల తరుపున సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. మరిం త అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్కు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తాకు విన్నవించడంతో సుందరీకరణకు మరిన్ని నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు.
– ఎన్సీ రాజమౌళి, మున్సిపల్ చైర్మన్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్
సాయంత్రమైతే ట్యాంక్బండ్కే..
పాండవుల చెరువు మినీట్యాంక్బండ్ అందంగా ముస్తాబవడంతో వార్డులోని ప్రజలంతా ఎక్కువగా సాయంకాలం చెరువు వద్దనే సేద తీరుతున్నారు. వాకింగ్ చేస్తూ పెద్దలు, ఆటలాడుతూ చిన్నారులు, కుటుంబ సభ్యులతో టిఫిన్ బాక్సులు కట్టుకుని మరీ వచ్చి చెరువు గట్టుపై సేద తీరుతున్నారు. అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– జకీయొద్దీన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గజ్వేల్-ప్రజ్ఞాపూర్
ఎస్సీ కాలనీకి మరింత వన్నెతెచ్చింది సీఎం కేసీఆర్ పట్టణాన్ని నలుదిశలా అద్భుతంగా
అభివృద్ధి చేస్తున్నారు.గజ్వేల్ పాండవుల చెరువు గతంలో ఎంతో పాడుబడ్డట్టుగా ఉండేది. సాయంత్రమైతే ఆ చెరువు వైపే ఎవరూ వెళ్లే వారు కారు. బతుకమ్మ,వినాయకచవితి పండుగలకు మాత్రమే పట్టణ ప్రజలంతా చెరువు వైపు వచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు చెరువు మినీట్యాంక్బండ్పై సందడి నెలకొంటున్నది. చెరువును అభివృద్ధి చేయడంతో ఎస్సీ కాలనీకి గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ గజ్వేల్కు ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– బొగ్గుల చందు, గజ్వేల్