చేర్యాల, ఫిబ్రవరి 10 : కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు పట్నం 4వ ఆదివారం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. పట్నం, లష్కర్వారాలతో పాటు 3 ఆదివారాలు హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. నేడు పట్నం వారానికి సుమారు 50వేల మందికి పైగా భక్తులు రానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా హుండీ ఆదాయం రూ. కోటీనలభై లక్షలు దాటింది. మరో ఎనిమిది వారాలు మిగిలిఉండడంతో హుండీతో పాటు ఆర్జీత సేవల ద్వారా మరింత ఆదాయం వచ్చే అవకాశమున్నది. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు మల్లన్నను దర్శించుకోవడంతో పాటు పట్నం వేసి బోనం సమర్పించనున్నారు. మహామండపం, గంగరేగు చెట్టు ఆవరణతో పాటు తాము బస చేసిన గదుల వద్ద పట్నాలు వేయనున్నారు. మరికొందరు భక్తులు మల్లన్నగుట్టపై ఎల్లమ్మకు, అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్ల బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. భక్తుల కోసం ఆలయ ఈవో ఏ. బాలాజీ, కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.