సిర్గాపూర్, మే 22 : సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో వడ్ల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం నల్లవాగు- సిర్గాపూర్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలు గంటపాటు నిలిచిపోయాయి. వడ్లు కాంటా పెట్టి రోజులు గడుస్తున్నా మిల్లులకు తరలించడంలో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలు కురుస్తుండడంతో వడ్లు తడిస్తే ఎవరి బాధ్యత అంటూ సంబంధిత ఐకేపీ సీసీ దుర్గయ్యను రైతులు నిలదీశారు.
గ్రామం లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కాంటా ప్రారంభించి వారమైనా ఇప్పటికీ ఒక్క లారీ వడ్లు మాత్రమే తరలించారని, రెండు రోజుల క్రితం రైతుల నుంచి రెండు లారీల వడ్లు కాంటా చేసి లోడింగ్ కు సిద్ధం చేసినా లారీలు రావడం లేదన్నారు. తూకం చేసిన వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో రైతులు, మాజీ ఉప సర్పంచ్ నాగభూషణం, శ్యామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.