చేర్యాల, ఫిబ్రవరి 25: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఆరోవారం సందర్భంగా ఆదివారం పూర్వపు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ తదితర జిల్లాల నుంచి 25వేల మందికి పైగా భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ప్రైవేటు, ఆలయ నిర్వహణలో ఉన్న దాతల గదులను అద్దెకు తీసుకుని బస చేశారు. ఆదివారం ఉదయం కోనేరులో స్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మహిళలు కొండపైన ఉన్న ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి తమ కోరికలు తీర్చాలని స్వామిని వేడుకున్నారు. ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకుడు నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. అడిషనల్ డీసీపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీను, కొమురవెల్లి ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునురుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆరో ఆదివారం వైభవంగా ఉత్సవాలు కొనసాగాయి.