జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. మంత్రి హరీశ్రావు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో సాగును పరిశీలిస్తున్నారు. ఫలితంగా జిల్లాలో 3,049 మంది రైతులు 10,433 ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగు చేశారు. 2021-22లో 2,763 ఎకరాల్లో, 2022-23లో 5,562 ఎకరాల్లో, 2023-24లో 2106 ఎకరాల్లో రైతులు సాగు చేశారు.
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో 14,700 ఎకరాల్లో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 30 ఏండ్లపాటు ఎకరానికి 12 టన్నుల దిగుబడి ఇస్తుండడం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం ఉండడంతో రైతులు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఆయిల్పామ్ ఫ్యాక్టరీలను నిర్మించి పంట కొనుగోలు చేస్తామని భరోసానివ్వడంతో రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.
– సిద్దిపేట, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
సిద్దిపేట, సెప్టెంబర్ 29( నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్, దీర్ఘకాలికంగా ఆదాయాన్ని ఇచ్చే పంట ఆయిల్పామ్. ఈ పంట సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. జిల్లాలో సాగునీటి వసతి పెరగడంతో సాగుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. సీఎం కేసీఆర్ ఆయిల్పామ్ రైతులకు చేయుత ఇవ్వడంతో పెద్దఎత్తున రైతులు సాగు చేస్తున్నారు. రైతుల కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ. 300 కోట్లతో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు.
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి శనివారం ఆయిల్పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు రైతులతో కలిసి భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మంత్రి హరీశ్రావు రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ క్షేత్రస్థాయిలో సాగును పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 3,049 మంది రైతులు 10,433 ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగుచేశారు.
2021-22లో 655 మంది రైతులు 2,763 ఎకరాల్లో సాగు చేశారు. 2022-23లో 1,711 మంది రైతులు 5,562 ఎకరాల్లో, 2023-24లో 683 మంది రైతులు 2106 ఎకరాల్లో సాగు చేశారు. మరో వెయ్యి ఎకరాల్లో సాగుచేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. డ్రిప్ డీడీలతోపాటు ఇతర పనులు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుత సమయం సాగుకు అనుకూలం కావడంతో రైతులు ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది వరకు సిద్దిపేట జిల్లాలో 14,700 ఎకరాల టార్గెట్ పూర్తి చేయాలని పెట్టుకున్నారు.
జిల్లాలోని నర్సరీలు
సిద్దిపేట జిల్లాలో మూడుచోట్ల నర్సరీలను ఏర్పాటు చేశారు. వీటితో జిల్లాలోని రైతులకు మొక్కలను సరఫరా చేస్తున్నారు. ములుగు మండలంలో 25 ఎకరాల్లో నర్సరీని స్థాపించగా, ప్రస్తుతం లక్షా 10 వేలు మొకలను 1,930 ఎకరాలకు, జగదేవ్పూర్ మండలంలోని యెల్లాయిగూడ గ్రామంలో 33 ఎకరాల్లో నర్సరీ స్థాపించగా.. ప్రస్తుతం 3. 65,536 లక్షల మొకలు 6,412 ఎకరాలకు, రంగనాయక సాగర్ రిజర్వాయర్ వద్ద 26 ఎకరాల్లో నర్సరీ స్థాపించగా, ప్రస్తుతం 3,93,991 లక్షల మొకలు 6,912 ఎకరాలకు, మొత్తం 15,254 ఎకరాలకు మొకలు అందుబాటులో ఉన్నాయి.
ఆయిల్పామ్ సాగు ప్రత్యేకతలు
ఆయిల్పామ్ రైతులకు దీర్ఘకాలం పాటు ఆదాయాన్నిస్తుంది. ఇతర పంటలతో పోలిస్తే సాగు సులువైన పంట.అన్నిరకాల నేలల్లో పండుతుంది. కేవలం నీటి వసతి ఉంటే చాలు. మొక నాటినప్పటి నుంచి 30 ఏండ్ల వరకు చాలా తకువ ఖర్చుతో సాగు చేయవచ్చు. నాలుగో సంవత్సరం నుంచి గెలల దిగుబడి ప్రారంభమై 30 ఏండ్ల వరకు ఎకరాకు ఏటా 12 టన్నుల దిగుబడితో ఖర్చులు పోనూ రూ.లక్ష వరకు నికర ఆదాయం మిగులుతుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో పెద్దఎత్తున ఆయిల్పామ్ సాగును ప్రోత్సహిస్తున్నది.
ఆయిల్పామ్తో లాభాలు..
ఎకరానికి సరాసరిగా 55 నుంచి 59 ఆయిల్పామ్ మొక్కలు నాటుతున్నారు. ఈ తోటలు ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకుంటాయి. మార్కెటింగ్ చెల్లింపుల పరంగా రైతులకు సురక్షితమైన పంట. కోతులు, అడవి పందుల వంటి జంతువుల నుంచి ఎలాంటి హాని లేదు. చీడ పురుగులు, రాళ్ల వాన బెడద తక్కువగా ఉంటుంది. బహుళ వార్షిక పంటల్లోకెల్లా ఆయిల్పామ్ ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇది ఎకరానికి 10నుంచి12 టన్నులు వచ్చి 30 ఏండ్ల వరకు రైతులకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
ఇటు రైతుకు, అటు పర్యావరణానికి మేలు కలిగించేదిగా పేరు గాంచింది. రైతులు పండించిన పంటలను పామాయిల్ కంపెనీలు వచ్చి కొనుగోలు చేస్తాయి. ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల పామాయిల్ పంటను సాగు చేయవచ్చు. పంట వేసిన నాలుగేండ్ల నుంచి ఎకరానికి 10నుంచి12 టన్నుల ఆయిల్పామ్ గెలల దిగుబడితో రూ.లక్ష వరకు, 30 ఏండ్ల వరకు, సంవత్సరం పొడవునా నిరంతర ఆదాయం పొందవచ్చు. పంట దిగుబడి సమయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం కంపెనీలు గెలలు కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో 15 రోజులకోసారి డబ్బులు జమ చేస్తాయి.
అంతర పంటలైన కూరగాయలు, అల్లం, మిల్లెట్స్, వంటి పంటలసాగుతో ఎకరానికి రూ. 30 వేల వరకు ఆదాయం పొందవచ్చు. కంచె వెంబడి వెదురు/మలబార్ వేప పంటలతో నాలుగేండ్ల నుంచి ఎకరానికి రూ.40 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. కంచె వెంబడి రెండో వరుసలో 65 శ్రీగంధం మొక్కలు పెట్టడంతో 15 ఏండ్ల తర్వాత ఎకరానికి సుమారుగా రూ. కోటి వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.
సిద్దిపేట జిల్లాలోని నంగనూరు మండలం నర్మెట గ్రామంలో తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆధ్వర్యంలో గంటకు 30 టన్నుల నుంచి 120 టన్నుల సామర్థ్యంతో 62 ఎకరాల్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీని రూ.300 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్ధ్యంతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నారు. గెలల పరిమాణం సామర్థ్యం పెరుగుతున్న కొద్ద్దీ క్రషింగ్ సామర్థ్ధ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలును ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు.
గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మాణం కావడం దేశంలోనే తొలిదని చెప్పవచ్చు. నర్మెట ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో మెదక్, జనగామ, మహబూబాబాద్, గద్వాల, నారాయణపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల ఆయిల్పామ్ గెలలను ప్రాసెస్ చేయడానికి అత్యాధునిక సామర్థ్యంతో మలేషియా టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.
ఫ్యాక్టరీ నిర్మాణంలో భాగంగా…
1) క్రూడ్ పామాయిల్ మిల్లు
2) పామ్ కెర్నల్ ఆయిల్ మిల్లు
3) విద్యుత్ ఉత్పత్తి కోసం కో జనరేషన్ ప్లాంట్
4) వ్యర్థాల రిసైక్లింగ్ కోసం కండెన్షేషన్ ప్లాంటు
5) క్రూడ్ పామాయిల్ను రిఫైనరీ చేయడానికి మిల్లు
6) ఇతర మిల్లింగ్ పనులు
యాభై వేలు సంపాదించిన..
హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 29: మూడున్నర ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటను పెట్టిన. ఈ తోటల్లనే పోయిన పసలకు పెసర, బబ్బెర, నువ్వులు పెట్టిన. వీటికి పదివేల దాక కర్సుసేత్తే. ఈ పప్పుధాన్యాల మీద యాభైవేల రూపాయల పంట వచ్చింది. మా సేన్లకు దగ్గరనే గుట్టలు ఉన్నయి. కోతులు మస్తు ఉన్నవి. ఎవసం ఏది సేసిన కోతులు వచ్చుడు సెడగొట్టుడు ఈ బాధ వద్దనుకున్నం.
గిసొంటి టైంల సర్కారు చెప్పడంతో పామాయిల్ తోట పెట్టిన. రెండు వందల మొక్కల దాక పెట్టిన. మంచిగనే బతికినయి. దీనికి డ్రిప్ సబ్సిడీ మీద ఇచ్చిండ్రు. దాన్ని ఇక్కడనే పెట్టిన. పామాయిల్ చెట్ల నడుమ బబ్బెర, ఉలువ, శనిగ, పెసల్లు, మినుములు ఇండ్లనే అలికినం. తోటల మధ్యలల్ల పంటలు వేస్తే ఈ తోటలకు జవ ఉంటంది. తోటకూడా మంచిగనే పెరుగుతున్నది. తోట పెట్టినం అని వదిలిపెట్టకుండా అండ్ల ఏదన్న పంట వేసుకుంటే రైతుకు మంచి లాభం ఉంటది.
– కాయిత రవీందర్రెడ్డి, రైతు, హుస్నాబాద్
ఆయిల్పామ్ సాగు చేస్తేరైతులకు లాభాలు
మిరుదొడ్డి, సెప్టెంబర్ 29 : నాకు మిరుదొడ్డిలో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఉద్యాన అధికారులు సూచనలతో 3 ఎకరాల్లో 171 మొక్కలతో ఆయిల్పామ్ పంట పెట్టాను. పంట పెట్టి రెండు ఏండ్లు గడుస్తున్నది. అక్కడక్కడ ఆయిల్పామ్ చెట్లు కాత కాస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాకు ఎకరాకు పెట్ట్టుబడి కింద రూ.4 వేలు చొప్పున రెండు ఏండ్లకు కలిసి 3 ఎకరాలకు మొత్తం రూ.24 వేలు పెట్టుబడి అందించింది. ఆయిల్పామ్లో అంతరపంటగా వరి, మొక్కజొన్న వేసుకుంటే మంచి ఆదాయం వస్తుంది.
– కుంట లక్ష్మణ్, రైతు, మిరుదొడ్డి
అంతర పంటలతో ఆదాయం..
అక్కన్నపేట, సెప్టెంబర్ 29: మాది అక్కన్నపేట. నాపేరు కర్ర ఉపేందర్రెడ్డి. నేను పీజీ వరకు చదువుకున్న. నాకు 6.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 25 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. రెండేండ్ల నుంచి వ్యవసాయం బంద్ చేశాను. 6.20 ఎకరాల్లో ఆయిల్పామ్ పంట పెట్టి రెండేళ్లు అవుతున్నది. మొదట్లో ఆయిల్పామ్ సాగు చేయడం మనతో అయితదో, కాదో అనే అనుమానం లోపల ఉండేది. పంట డిమాండ్ను అంచనా వేసుకున్న. ఆయిల్పామ్కు పెట్టుబడి తక్కువ. అంతర్గత పంటలు వేసుకోవచ్చు.
మొదట వేరుశనగా వేసిన. ఇప్పుడు అంతర పంటగా 5 ఎకరాల్లో పత్తి, ఎకరాలో మిరప చేను, 10 గుంటల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగుచేస్తున్న. అంతర పంటగా వేసిన పత్తి విరబూసింది. ఆయిల్పామ్ పంటకు అడవి పందులు, కోతులు, ఇతర పక్షల బెడద ఉండదు. చాలా తక్కువ నీటి వినియోగం, డ్రిప్ ద్వారా పారకం, ఇరవై రోజులకోసారి స్ప్రే చేయడం, మూడు నెలలకోసారి కొద్ది మోతాదులో రసాయన ఎరువుల వాడకం ఉంటుంది. కూలీల అవసరం లేదు.
ఎకరాకు 57 మొక్కులు నాటిన. రూ. 25కు (నిజానికి మొక్క ఖరీదు రూ. 200 వరకు ఉంటుంది) సబ్సిడీపై ప్రభుత్వం అందజేస్తూ నాలుగేండ్లలో ఆయిల్పామ్ దిగుబడి వచ్చే వరకు రైతుకు పెట్టుబడి కింద నగదును ఖాతాలో జమచేస్తోంది. ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ను ఇస్తున్నది. వరి, మక్క ఇతర పంటలతో పోల్చుకుంటే ఆయిల్పామ్ సాగు చాలా బెటర్. దీర్ఘకాలిక ఆదాయం ఉంటుందని భరోసా కలిగింది. రైతులు అయిల్పామ్ చేపడితే బాగుంటుంది.
– కర్ర ఉపేందర్రెడ్డి, యువరైతు, అక్కన్నపేట
ఆయిల్పామ్తో ఏ రంది లేదు..
కోహెడ, సెప్టెంబర్ 29: మా మెట్ట ప్రాంతంలో ఇంతక ముందు సాగునీరు లేక రైతులు బత్తాయి, నిమ్మ, మామిడి చెట్లు పెట్టుకునేది. ఇప్పుడు ఆయిల్పామ్ నయ అనిపిస్తున్నది. ప్రభుత్వమే సబ్సిడీపై మొక్కలు అందిస్తున్నది. నాకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిలో ఆయిల్పామ్ మొక్కలు పెట్టిన రెండేండ్లు అవుతున్నది. మా పక్క మండలం నంగునూరులో ఆయిల్పామ్ ఫ్యాకరీ పెడుతున్నరు. ఫ్యాక్టరీ నాకు దగ్గరుంటది. అట్లనే మొదట అంతర పంటగా వేరు శనగ వేస్తే లాభం వచ్చింది. ఇప్పుడు పత్తి పంట వేసిన. పత్తి పంట మంచిగుంది. ఆయిల్పామ్ వేసుకుంటే అంతర పంటలు నాలుగేండ్ల దాక సాగు చేసుకోవచ్చు. అప్పటి నుండి రైతుకు ఆయిల్పామ్ కాపునకు వస్తుంది. రైతుకు ఏరంది ఉండదు. – బండ బాలయ్య, రైతు, కోహెడ
అంతర పంటల సాగుతో ఆదాయం
ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటలు సాగుచేస్తూ రైతులు ఆదాయం పొందుతున్నారు. మూడేండ్ల వరకు ఆయిల్పామ్లో అంతర పంటలుగా మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి, అరటి, సోయాచిక్కుడు, పెసర, మినుములు, బొప్పాయి, పుచ్చ తదితర వాటిని సాగుచేసుకోవచ్చు. ఆయిల్ పామ్ ఆకులు విస్తరించే వరకు వేరు వ్యవస్థకు నష్టం వాటిల్లకుండా అంతర పంటలు సాగుచేస్తూ రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. 5 ఏండ్ల తర్వాత ఆయిల్పామ్ తోటలలో అంతర పంటలుగా నీడలో పెరిగే కోకో, అల్లం, అనాస, ఔషధ మొక్కలు, పశుగ్రాసం వేసుకొని అదనంగా రూ. 30 వేల నుంచి 40 వేల వరకు ఎకరానికి రైతు పొందవచ్చు.
ఆయిల్పామ్ చెట్టు నుంచి వెలువడే ఆకులు, ఎండిన మగ గెలలు, మట్టలు నుంచి వెలువడే ఖాళీ గెలల పీచును ముక్కలుగా చేసి మొక్క పాదుల్లో వినియోగించడం ద్వారా సేంద్రియ ఎరువుగా మారి రసాయనిక ఎరువుల వినియోగాన్ని, ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. కలుపు మొక్కలు ఎదుగుదలను నియంత్రించడమే కాకుండా భూమిలో తేమను నిల్వపర్చుకొని నీటి వినియోగం తగ్గి, గాలితో తేమ పెరిగి జీవ సంబంధిత సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల మొక్కల పెరగుదలకు దోహదపడి భూమి కాలుష్యాన్ని, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఆయిల్పామ్ తోటల సాగుపై ఖర్చులు పోనూ నికర ఆదాయం ఎకరానికి సరాసరిగా లక్షన్నర వరకు ఆదాయం వస్తుంది.
దుబ్బాక, సెప్టెంబర్ 29 : నేను వరి బంద్జేసి ఆయిల్పామ్ తోట వేసిన. ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు 35 ఏండ్ల వరకు పంట కాత వస్తుంది. దీంతో మాకు ఢోకా ఉండదు. మొక్కల పెంపకంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తున్నా. అధికారుల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటున్నా. మూడెకరాల్లో 172 మొక్కలు నాటా. ఇందులో అంతరపంటగా ఆరటితోట సాగు చేస్తున్నా. మొక్కజొన్న, పెసర, బబ్బెరతో పాటు టమాట, వంకాయ, సొరకాయ, మెంతి, కొత్తిమీర, పుంటికూర పండిస్తున్నా. మా గ్రామంలో తొలిసారి నేను ఆయిల్పామ్ తోట పెట్టిన. నన్ను చూసి చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు.
నాకు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 3 ఎకరాలు ఆయిల్పామ్ సాగుచేస్తున్నా. ఒక్కో ఎకరంలో 57 మొక్కలు చొప్పున మొత్తం మూడెకరాల్లో 172 మొక్కలు నాటాడు. ఒక్కో మొక్కకు 9 మీటర్ల వ్యత్యాసంతో (దూరంతో) నాటాను. వాటికి డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నా. మా గ్రామంలో నాతో పాటు మరో పదిహేను మంది రైతులు ఆయిల్పామ్ సాగుచేస్తున్నారు. హబ్షీపూర్లో సుమారు 80 ఎకరాల్లో పంట సాగవుతున్నది. కాలంతో పనిలేకుండా తేలికపాటి భూమిలో ఈ పంట సాగు చేసుకోవచ్చు. అంతరపంటలు వేసుకోవచ్చు. రైతులకు చాలా ఆదాయం వస్తుంది.
– మహమ్మద్ గౌస్, రైతు, హబ్షీపూర్
ఏడాదిలో రెండు లక్షల ఆదాయం జూసిన..
రాయపోల్, సెప్టెంబర్ 29 : నాకున్న మూడెకరాల్లో ఆయిల్పామ్ పంట వేశాను. మొత్తం 2000 మొక్కలు నాటాను. మొక్కలు ఏపుగా పెరిగాయి. డ్రిప్ను ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందజేసింది. మొక్కల మధ్య చాలా భూమి గ్యాబ్ ఉండడంతో అంతర పంటలు పండించా. సోయాబీన్, కీరా, లోబోన్, ఆలుగడ్డ చేయగా ఖర్చులు పోను 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఏడాది ఆగితే ఆయిల్పామ్ పంట దిగుబడి ప్రారంభమైతది. యాసంగి, వానకాలంలో అంతర పంటలను సాగు చేసుకునే అవకాశం ఉండడంతో మాకు అనుకూలంగా ఉంది. మా మండలంలో చాలా మంది రైతులు ఆయిల్పామ్ వేసేందుకు ముందుకు వస్తున్నారు.
– పాపాని వీరస్వామి, రైతు, వీరారెడ్డిపల్లి, రాయపోల్
ఆయిల్పామ్తో లాభమే
సిద్దిపేట రూరల్, సెప్టెంబర్ 29: ఆయిల్పామ్ పంటతో లాభమే కానీ నష్టం అయితే లేదు. ఏడున్నర ఎకరాల్లో ఆయిల్పామ్ పంట వేసిన. ఇప్పుడు 475 మొక్కలు ఎదుగుతున్నయ్. ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.4200 సబ్సిడీ ఇచ్చింది. డ్రిప్ సబ్సిడీ 90శాతం ఇచ్చిండ్రు. ఉద్యానవనశాఖ అధికారి బాలాజీ సహకారం మరువలేనిది. ఎప్పటికప్పుడు సలహాలు,సూచనలు ఇస్తున్నరు. పంటను పరిశీలిస్తున్నరు. ఏడున్నర ఎకరాల్లో ఆయిల్పామ్ వేసినంక అంతర పంటగా బొప్పాయి 4 ఎకరాల్లో పెట్టిన.
ఇప్పటికి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చింది. 2 ఎకరాల్లో సొరకాయ తీగలు పెట్టిన. చీడపీడలు తక్కువగా ఉంటాయని సొరకాయ పెడుతున్న. పోయిన పంటకు రూ.40 వేల వరకు ఆదాయం వచ్చింది. మల్లా ఇదే రెండెకరాల్లో సొరకాయ తీగ పంట వేసేందుకు గుంతలు తీస్తున్నం. అల్లం, గుమ్మడికాయ కూడా వేసినం. 20 గుంటల్లో కాకరకాయ వేస్తా. సిద్దిపేట రైతుబజార్ దగ్గర ఉండడంతో అంతర పంటలకు గిరాకీ ఉంది. అధికారుల ప్రోత్సాహం బాగుంది. రైతులకు లాభం చేకూరే పంట ఆయిల్పామ్.
– గడీల గోవర్ధన్రెడ్డి, రైతు, చిన్నగుండవెల్లి గ్రామం, సిద్దిపేట రూరల్