మెదక్ రూరల్, సెప్టెంబర్ 2: మాత శిశు సంరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు, సమతుల్యత ఆహారం తీసుకునే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణులు, బాలింతలు చిన్నారులు పోషణ లోపంతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో గుడ్లు, పాలు, బాలామృతం, మధ్యాహ్నభోజనం అందిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న కొంత మంది చిన్నారులు పోషకాహార లోపంతో సరైన ఎదుగుదల లేకపోవడం, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి అంగన్వాడీ ఆధ్వర్యంలో ఇప్పటికే జిల్లావ్యాప్తంగా గ్రోత్ మానిటరింగ్ చేశారు. వైద్య సిబ్బంది, ప్రజల భాగస్వామ్యంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మహిళా శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
పోషకాహారంపై అవగాహన
చిన్నారుల ఆరోగ్య స్థితిగతులపై అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు పరిశీలించి వయస్సుకు తగ్గ బరువులేని పిల్లలను గుర్తించి, వారికి సరైన ఆహారం అందించడంతో పాటు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తారు. కిషోర బాలికలకు ఆరోగ్య అంశాలపై అవగాహన, గర్భిణులు, బాలింతలు, పోషకాహారంపై తీసుకోవాల్సిన అవశ్యకతను తెలియజేస్తారు.
పిల్లల ఎత్తు బరువుపై నివేదికలు
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తును కొలుస్తారు. ఏ వయస్సులో ఎంత బరువు ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలనే వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్రోత్ మానిటరింగ్ సర్వే యాప్లో అంగన్వాడీ టీచర్లు నమోదు చేస్తున్నారు. దీంతో తక్కువ బరువు ఎత్తు ఉండి పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని సులువుగా గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశమున్నది.
ఈ నెల 1 నుంచి 30 వరకు చేపట్టే కార్యక్రమాలు
ఈ నెల 1నుంచి 15వరకు పౌష్టికాహారంపై అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, సహాయకులు ప్రత్యేక పర్యవేక్షణ డ్రైవ్ నిర్వహిస్తారు. మూడో వారంలో అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లోనూ నూట్రీ గార్డెన్లు పెంపొందించడంపై అవగాహన, నాలుగో వారంలో పోషణపై మానిటరింగ్ చేపట్టనున్నారు.
మెదక్లోని ఐసీడీఎస్ వివరాలు
ఐసీడీఎస్ ప్రాజెక్టులు 4
1. మెదక్ 2. అల్లాదుర్గం,
3. రామాయంపేట,
4. నర్సాపూర్
అంగన్వాడీ కేంద్రాలు మొత్తం : 1076
ప్రధాన కేంద్రాలు-885, మినీ కేంద్రాలు-191
గర్భిణులు జిల్లా వ్యాప్తంగా – 6733
బాలింతలు జిల్లా వ్యాప్తంగా – 6363
చిన్నారుల వివరాలు
7 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు – 6615
1 సంవత్సరం నుంచి మూడేండ్ల లోపు – 22407
3 సంవత్సరాల నుంచి ఆరేండ్ల లోపు చిన్నారులు – 23155
అవగాహన కార్యక్రమాలు చేపట్టాం..
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాలతో కూడిన ఆహారం పంపిణీ చేస్తున్నాం. పోషణ్మాసం కార్యక్రమాల్లో భాగంగా పోషణ లోపంతో తలెత్తే ఇబ్బందులు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తాం. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో శుభ్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వయస్సుకు తగ్గ బరువు లేని పిల్లలను గుర్తించి, వారికి సరైన పౌష్టికాహారం అందించాలని సూచనలు చేస్తున్నాం.
– హేమాభార్గవి సీడీపీవో, నర్సాపూర్
పోషణ లోపం నివారణే ధ్యేయం
చిన్నారుల్లో ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తూనే పోషణమాసం నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్లో ప్రతి కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం. పిల్లల పెరుగుదలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ఎదుగుదల లేని పిల్లలపై దృష్టి పెట్టి తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పిస్తున్నాం.
– బ్రహ్మజీ, మహిళా శిశు సంక్షేమ శాఖ (ఇన్చార్జి) అధికారి మెదక్