రామాయంపేట, మే 9 : మెదక్ జిల్లాలో సింగిల్ రోడ్లను డబుల్గా మా ర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇప్పటికే ప్రతి పల్లెలో తారు రోడ్డు కనిపిస్తున్నది. మేజర్ పంచాయతీలు, మండలాలను కలిపేందుకు మ రో అడుగు ముందుకేసింది. అక్కన్నపేట, ఉప్పులింగాపూర్ సింగిల్ రోడ్డును 20.400 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డుగా మార్చేందుకు రూ.30 కోట్లు సీఆర్ఎఫ్ నిధులు మంజూరుచేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు కృషితో ఈ నిధులు మంజూరు చేశారు. దశాబ్దాల కాలంగా అక్కన్నపేట నుంచి చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి మీదుగా వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్ వరకు ఉన్న రోడ్డులో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియని పరిస్థితి ఉండేది. సింగిల్ రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రైతులు కూడా తమ పొలం నుంచి ఇంటికెళ్లేలోపు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలు చెందేవారు. డబుల్ రోడ్డు పనులు పూర్తి కావడంతో రైతులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోని మూడు మండలాలను కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవకు ప్రతిఒక్కరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు.
రోడ్డు విస్తరణతో ప్రయాణం సులువు
రోడ్డు విస్తరణతో ప్రజా రవాణా వ్యవస్థతో పాటు రామాయంపేట, వెల్దుర్తి, చిన్న శంకరంపేట మూడు మండలాల దూరం మరింత తగ్గిపోయింది. నర్సాపూర్ నియోజకవర్గం మెదక్కు దగ్గరైంది. రామాయంపేట నుంచి నర్సాపూర్కు వెళ్లాలంటే చేగుంట, తూప్రాన్, శివంపేట మీదుగా వెళితే 70 కిలోమీటర్ల మేర వ్యత్యాసం ఉండేది. ప్రస్తుతం అక్కన్నపేట, ఉప్పు లింగాపూర్ రోడ్డు నిర్మాణంతో రామాయంపేట నుంచి చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి మీదుగా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ నుంచి నర్సాపూర్కు కేవలం 54 కిలోమీటర్లు వస్తుంది. దీంతో సుమారు 16 కిలోమీటర్ల దూరభారం దగ్గరైంది. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రైతులు, స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. అక్కన్నపేట నుంచి ఉప్పులింగాపూర్ వరకు ప్రజల సౌకర్యార్థం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి 65 కల్వర్టులు, రెండు బ్రిడ్జిలు నిర్మించింది.
డబుల్ రోడ్డు పనులు పూర్తి చేశాం
అక్కన్నపేట-ఉప్పులింగాపూర్ 20.400కిలోమీటర్ల బీటీ డబుల్ రోడ్లకు ప్రభు త్వం రూ.30కోట్లు మంజూ రు చేసింది. దీంతో మూడు మండలాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. రామాయంపేట మండ లం అక్కన్నపేట, చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్, గవ్వలపల్లి, మడూరు, జంగరాయి గేటు నుంచి వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ నుంచి వెల్దుర్తి మండలానికి కలుస్తుంది. ఈ రోడ్డు మూలంగా వ్యాపార వర్గాల వారికి పూర్తి అనుకూలంగా ఉంటుంది. ఈ రోడ్డు వెంట 65 కల్వర్టులు, 2 బ్రిడ్జిలు నిర్మించాం.
– విజయసారథి, ఆర్అండ్బీ ఏఈ, రామాయంపేట
వెల్దుర్తి మండలానికి దగ్గరవుతాం
వెల్దుర్తి నుంచి అక్కన్నపేట గ్రామం వరకు డబుల్ రోడ్డు వేసిండ్రు. ఇప్పు డు ఉప్పులింగాపూర్ నుంచి అక్కన్నపేటకు మేము బాగా దగ్గరవుతున్నాం. మా గ్రామం వరకు మంత్రి హరీశ్రావు రోడ్డుకు నిధులు తెచ్చిండు. మాకు చాలా సంతోషం. ఇప్పుడు మా ప్రయా ణ బాధలు తీరినయి. గతంలో ఈ రోడ్డులో ప్రయాణించాలంటే నరకప్రాయంగా ఉండేది. సింగిల్ రోడ్డులో వాహనం నడపాలంటే భయాందోళన చెందేవాళ్లం. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతున్నది. సీఎం కేసీఆర్కు, మంత్రి హరీశ్రావుకు ధన్యావాదాలు.
–శ్రీనివాస్, అక్కన్నపేట
సీఎం కేసీఆర్ మేలు మరిచిపోం
అక్కన్నపేట నుంచి ఉప్పులింగాపూర్ గ్రామం వరకు ప్రభుత్వం డబుల్ రోడ్డు నిర్మించడం హర్షించదగ్గ విషయం. గతంలో ఉన్న చిన్న రోడ్డుతో ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం జరుగుతుందేమో నని భయపడుతూ ప్రయణించే వాళ్లం. చాలా సమయం ప్రయాణంలోనే గడిచి పోయేది. ఏదైనా పనిమీద వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడే వాళ్లం. ఇప్పుడు డబుల్ రోడ్డుతో ప్రయాణం సులువుగా సాగుతున్నది. దీంతో పాటు మూడు మండలాలు దగ్గరగా అయినట్లు అనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ మేలు ఎప్పటికీ మరిచిపోలేం.
– తుడుం రాజు, ఆటో డ్రైవర్, ఝాన్సీలింగాపూర్